వైసీపీ ఎమ్మెల్యే పాట - అధికారుల కోరస్ : మోత పుట్టిస్తోంది- జాతీయ స్థాయిలో...!!
వైసీపీ ఎమ్మెల్యే రాగం అందుకున్నారు. ఆయనతో అధికారులు కోరస్ పాడారు. జాతీయ స్థాయి పోటీల కోసం వారు పాడిన ఈ పాట ఇప్పుడు మోత పుట్టిస్తోంది. 'తెగువకు తెగువకు రణరణ సమరం..లే..పంగా కబడ్డీ కబడ్డీ ఖే లో కబడ్డీ' అంటూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పాటను ఆలపించారు. ఆయన పాడుతుంటే.. తిరుపతి మేయర్ శిరీష, కమిషనర్ గిరీష, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు గొంతు కలిపారు. తిరుపతి వేదికగా నిర్వహిస్తోన్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ఆల్బమ్ ను విడుదల చేయనున్నారు.
తిరుపతిలోని లూప్స్ స్థూడియోలో ఈ మేరకు రికార్డింగ్ పూర్తి చేసారు. బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ పాడిన పాట లే..పంగా..లే..పంగా అంటూ కబడ్డీ ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు ప్రో కబడ్డీని ఉన్నత స్థానానికి చేర్చింది. ఈ పోటీల నిర్వహణా బాధ్యతలను .. స్థానిక ఎమ్మెల్యే అయిన కరుణాకర రెడ్డి బాధ్యలు తీసుకున్నారు. . ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ కబడ్డీ క్రీడ పౌరుషానికి ప్రతీక అని చెప్పారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా జరిగే ఈ పోటీలు డే అండ్ నైట్ మ్యాచ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఫ్లెడ్లైట్ల వెలుగులో జరిగే ఈ మ్యాచ్లు నగర వాసులకు కొత్తదనాన్ని అందించనున్నాయన్నారు. భూమన పాట పాడుతున్న విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తొలి నుంచి వామపక్ష భావజాలం ఉన్న భూమన కరుణాకర రెడ్డి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. నాడు వైఎస్సార్.. నేడు జగన్ కు ఆత్మీయుడిగా నిలిచారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్ గానూ పని చేసారు. భూమన కుమారుడు సైతం ఇప్పుడు తిరుపతి డిప్యూటీ మేయర్ గా వ్యవహరిస్తున్నారు. వైసీపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు.