వార్తలు రాసి నన్నే బెదిరిస్తావా .. నువ్వెంత , నీ సంగతి తేలుస్తా : రిపోర్టర్ పై వైసీపీ ఎమ్మెల్యే వీరంగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే ఓ పత్రిక విలేఖరిపై చిందులు తొక్కారు. నన్ను బెదిరించాలని చూస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తారా? నీ సంగతి తేలుస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఒక ప్రెస్ మీట్ లో పబ్లిక్ గా మీడియా పై చిందులు తొక్కిన ఆ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
మీడియాపై విరుచుకుపడిన వైసీపీ ఎమ్మెల్యే
గుంటూరు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మీడియాపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. మీడియా సమావేశంలో పబ్లిక్ గా ఒక రిపోర్టర్ పై వీరంగం వేశారు. సదరు మీడియా ప్రతినిధిని బెదిరించే ధోరణిలో మాట్లాడారు. ఇదే సమయంలో మండల స్థాయి అధికారుల పైన కూడా దుర్భాషలాడారు . వినుకొండలో అసైన్డ్ భూములు ఆక్రమించి అక్రమంగా ప్లాట్లు వేశారని, ఆ వార్తలు రాయకుండా, పట్టణంలో ఉన్న సమస్యల పైన వార్తలు ఎందుకు రాస్తున్నారని ఆయన విలేఖరులను ప్రశ్నించారు.
తమాషాగా ఉందా .. నీ సంగతి తేలుస్తా అంటూ వార్నింగ్
ఒక పత్రికకు సంబంధించిన విలేఖరిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అందరి ముందు రెచ్చిపోయి వార్నింగ్ ఇచ్చారు. పట్టణంలో గత పదేళ్లలో సమస్యలేమీ లేవా ? ఇప్పుడే ఉన్నాయా? అంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఈ ఊళ్ళో మంచినీరు ఇవ్వలేదని నీకే అధికారి చెప్పాడు. మర్యాదగా రాస్తే మర్యాదగా ఉంటుంది. ఎంతవరకు ఉండాలో అంత వరకే ఉండు అంటూ చిందులు తొక్కారు. నువ్వు చాలా చేస్తున్నావు.. తమాషాగా ఉందా .. నీ సంగతి ఏంటో తేలుస్తా..అంటూ హెచ్చరించారు.
నీ చరిత్ర నా దగ్గరుంది .. నిన్నేం చేస్తానో చూద్దాం అంటూ వార్నింగ్
వార్తలు రాసి నన్నే బెదిరిస్తావా.. నువ్వెంత అంటూ కూర్చున్న సీట్లో నుంచి లేచి ఆగ్రహంతో ఊగిపోయారు. ఏది పడితే అది రాస్తే చూస్తూ ఊరుకుంటామా ఆత్మాభిమానాలు మాకు ఉంటాయంటూ మండిపడ్డారు. నన్ను బ్లాక్ మెయిల్ చేయాలంటే నీ తరం కాదు.. నువ్వెవరెవర్ని బ్లాక్ మెయిల్ చేశావో అందరి చిట్టా నా దగ్గర ఉంది . నీ మీద ఏం చేస్తానో చూద్దాం వుండు.. ఇది నీకు ఫస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అంటూ విలేఖర్ల అందరిముందు ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాదు బయటకు పొమ్మంటూ చిందులు తొక్కారు.
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వీరంగం ... ఏపీలో చర్చనీయాంశం
రిపోర్టర్ల పై ఎమ్మెల్యే వేసిన వీరంగం మీడియా సమావేశానికి వచ్చిన రిపోర్టర్లనందరిని షాక్ కు గురి చేసింది. ఒక ప్రజా ప్రతినిధి వార్తలు రాసిన రిపోర్టర్ ను బాహాటంగా ఇలా బెదిరించడంపై జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు తీరు చర్చనీయాంశంగా మారింది.