విజయసాయిరెడ్డి భేష్.. బడ్జెట్ సెషన్లో ఉత్తమ పనితీరు, ప్రశంసించిన పెద్దల సభ..
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ ప్రశంసలతో ముంచెత్తింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తనకొచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని ప్రశంసించారు. బడ్జెట్ సమావేశాల్లో 155 మంది సభ్యులు ప్రసంగించగా.. అందులో విజయసాయిరెడ్డిని కీర్తించడం విశేషం. పెద్దల సభలో వివిధ అంశాలపై చర్చించినందుకు గాను విజయసాయిరెడ్డి పనితీరును రాజ్యసభ ప్రశంసించింది.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరిచారని రాజ్యసభ పేర్కొన్నది. తనకు వచ్చిన తొమ్మిది అవకాశాలను విజయసాయిరెడ్డి సమర్థవంతంగా ఉపయోగించుకున్నారని తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ గురించి ప్రస్తావించారు. బడ్జెట్పై కూడా తన అభిప్రాయాన్ని సమర్థవంతంగా తెలియజేశారని రాజ్యసభ సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
జీరో అవర్, ప్రత్యేక ప్రస్తావన, ఐదు సప్లిమెంటరీ, ఒక స్టార్ కొశ్చన్, 4 స్టార్ ప్రశ్నలకు సప్లిమెంటరీ ప్రశ్నలను కూడా విజయసాయిరెడ్డి అడిగారని రాజ్యసభ సచివాలయం తెలియజేసింది. పెద్దల సభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిభ కనబరిచారని రాజ్యసభ సచివాలయం గుర్తించడంపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది వైసీపీ, విజయసాయిరెడ్డి మంచి పేరు తీసుకొచ్చిందని చెప్పారు.