ఆ రెండు పార్టీల స్నేహం పట్ల భగ్గుమంటున్న వైసీపి..! కాంగ్రెస్ నేతలకు ముందస్తు గాలం..!!
హైదరాబాద్: ఏపీలో రాజకీయ వ్యూహాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎత్తులకు పై ఎత్తులే కాకుండా ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే అంశంపై ఓ కన్నేసి ఉంచాయి రాజకీయ పార్టీలు. ముఖ్యంగా వైఎస్ఆర్ సీపి అదికార తెలుగుదేశం పార్టీ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతో పొత్తుకు ఉబలాటపడుతోంది, పొత్తు పెట్టుకోబోయే పార్టీ బలంబలహీనతలు ఏంటి అనే అంశాల పట్ల ఆరా తీస్తున్నట్టు సమాచారం.
ఏపీలో మారిన రాజకీయ సమీకరణాల ప్రకారం టీడిపి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న తరుణంలో.. అసలు ఏపీ కాంగ్రెస్ లో ఉన్న అతికొద్ది మంది ముఖ్య నేతలను తమవైపు తిప్పుకుంటే ఏ గొడవా ఉండదు కదా అనే దిశగా వైసీపి సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలను ఆకర్శించగలిగితే తెలుగుదేశం పార్టీ దూకుడుకు వైసీపి కళ్లెం వేసినట్టేననే చర్చ జరుగుతోంది.
టీడిపి వ్యూహానికి వైసీపి ప్రతివ్యూహం..! కాంగ్రెస్ నేతలకు ముందస్తు గాలం..!!
కాంగ్రెస్తో టీడీపీ జతకట్టినా, లోపాయికారీ ఒప్పందంతో సీట్ల పంపిణీ జరిగినా, వైసీపీ కోలుకోలేని దెబ్బతినాల్సి వస్తుంది. పైగా 2024 వరకూ దాన్నుంచి బయటపడటం కష్టం కూడా. అందుకే తమ బలం పెంచుకోవటంతో పాటు హస్తం బలహీనమయ్యేలా చేయటం ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే కోణంలో అధినేత జగన్ వ్యూహాలకు పదను పెడుతున్నాడు. హస్తం పార్టీకి ఉన్న ఓటుబ్యాంకుతో పాటు, సామర్త్యం ఉన్న నేతలను పదవుల ఆశతో తనవైపు తిప్పుకుంటే భవిశ్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవనే దిశగా వైసీపి అదినేత జగన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
జరిగిన తప్పు మళ్లీ జరగదు..! అందరూ పార్టీలోకి రావాలంటున్న జగన్..!
గతంలో వైసీపి నుండి కొందరు నేతలు అక్కడి పరిస్థితులను సరిగా ఆకళింపు చేసుకోలేక పార్టీ వీడిపోయారు. పార్టీ మారిన వారందరూ కూడా చిన్నచిన్న కారణాలతో మారారు తప్ప పెద్ద రీసన్ మాత్రం ఏమీ లేదనే చర్చ జరుగుతోంది. పోయిన సీనియర్ నేతలను మళ్లీ వెనక్కి తీసుకురావడం తో పాటు ఇతర పార్టీల నుంచి కూడా నాయకులను ఆహ్వానించాలని జగన్ మాస్టార్ ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇటు ఉత్తరాంధ్ర నుంచి అటు సీమ వరకూ అవకాశం ఉన్న నేతలకు వల విసిరి తమ పార్టీ కండువా కప్పే పనిలో వైసీపి ముఖ్య నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో రాజాం మాజీ ఎమ్మెల్యే కొండ్రు మురళి ఇటీవల తాను పార్టీ మారతానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ద్వారా సైకిల్ ఎక్కబోతున్నారు.
కాంగ్రెస్ నేతలకు ముందస్తు గాలం..! టీడిపి తో స్నేహాన్ని చేయొచ్చు భగ్నం..!!
ఉత్తరాంధ్రలో ఒక్క వలస నేత పెరిగినా ఆ పార్టీవైపు ఓటర్లు మొగ్గుచూపుతారు. ఇది టీడీపీ, వైసీపీ రెండు పార్టీలను ఆందోళనకు గురిచేసే అంశం కూడా. పైగా బొత్స సత్యనారాయణ కూడా ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. వైసీపీలో ఇమడలేక.. తిరిగి హస్తం గూటికి చేరబోతున్నారనే పుకార్లు కూడా వెలువడుతున్నాయి. గోదావరి జిల్లాలోను వైసీపీ నుంచి కన్నబాబు, పిల్లి సుబాష్చంద్రబోస్ తదితరులు కూడా వేరే పార్టీ మారాలనే యోచనలో ఉన్నారట. ఇదే జరిగితే. వీరివెంట మరికొందరు నేతలు క్యూకట్టవచ్చు. ప్రకాశం జిల్లాలో టీడీపీ వర్గపోరు తమకు అనువుగా మలచుకోవాలనుకున్నా, మాజీ ఎమ్మల్యే ఉగ్రనరసింహారెడ్డి సైకిల్ ఎక్కాలని ముచ్చటపడుతున్నారు. ఇటీవల తానే స్వయంగా చంద్రబాబుకు తన మనసులో మాట వెలిబుచ్చినట్టు తెలుస్తోంది.
Recommended Video
ఏ పార్టీ సమీకరణాలు ఎలా ఉన్నా.. కాంగ్రెస్ ముఖ్యులు రావాలి.. అదే జగన్ మాస్టర్ ప్లాన్..!!
ప్రస్తుతం అదే నియోజకవర్గ ఎమ్మెల్యే గా కదిరి బాబూరావు వున్నారు. టీడీపీకు చెందిన ఈయన ప్రాబల్యం కూడా బాగానే ఉంది. పైగా నందమూరి బాలయ్యకు మంచిమిత్రుడు. ఒకవేళ చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో రెడ్డి వర్గం కోసం ఉగ్రనరసింహారెడ్డికి సీటిస్తే నందమూరి, నారా కుటుంబాల మధ్య కొత్త గొడవలకు శ్రీకారం చుట్టినట్టవుతుంది. పైగా ఇద్దరూ వియ్యంకులు కూడా. గుంటూరు జిల్లాలోనూ బీజేపీ, వైసీపీలకు ఝలక్ ఇస్తూ కొందరు కాపు నేతలు జనసేనలో చేరే యోచనలో ఉన్నారు. ఇది టీడీపీ కంటే వైసీపీపైనే ప్రభావం చూపుతుందనే ఆందోళన కూడా ఉంది. వీటన్నింటినీ అధిగమించి పోయిన బలం తిరిగి పుంజుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు వైసీపీ గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపి వ్యూహం పక్కాగా అమలైతే ఏపీలో తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కులు తప్పేలా లేవు.