న్యాయం చేయమంటే కేసులా? వైసీపి విధానాలు అప్రజాస్వామికమన్న జనసేన.!
అమరావతి: విశాఖపట్నంలో రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ లోని వాహనం ఢీ కొనడంతో గేదెల సూర్యనారాయణ అనే భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందారు అనే వార్త మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించిందని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్ర మంత్రి తన వాహనాన్ని ఆపి ప్రమాదం బారిన పడిన వ్యక్తి పరిస్థితి ఏమిటని కనీసం పరామర్శ కూడా చేయకుండా వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. రెక్కల కష్టం మీద బతికే ఆ కార్మికుడి కుటుంబానికి న్యాయమైన పరిహారం ఇప్పించి, ఆ కుటుంబానికి ఆధారం కల్పించాలనే విషయాన్ని మంత్రికి తెలియచేసేందుకు వెళ్ళిన జనసేన నాయకులను పోలీసుల ద్వారా అడ్డుకొని అక్రమంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. బాదితుడి కుటుంబం తరుపున పరిస్ధితి వివరించడానికి వెళ్లిన భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా.సందీప్ పంచకర్ల, విశాఖ నార్త్ ఇంచార్జ్ శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్, పార్టీ నాయకులు అప్పారావు, శాఖరి శ్రీనివాస్, శ్రీమతి అమరాపు దుర్గ, శ్రీమతి కళ, శ్రీమతి త్రివేణిలను అరెస్టు చేసి, కేసులు నమోదు చేయడం దారుణమన్నారు మనోహర్.
అంతే కాకుండా మృతుడి కుటుంబానికి 50 లక్షల రూపాయల పరిహారం, అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పిల్లల చదువుల బాధ్యతను తీసుకోవాలని జనసేన హేతుబద్ధంగా డిమాండ్ చేసిందని తెలిపారు. న్యాయం చేయమని కోరితే కేసులుపెట్టడం ఏంటని, బాధిత కుటుంబానికి బాసటగా నిలవడం బాధ్యత కలిగిన పార్టీగా జనసేన విధి అన్నారు మనోహర్. మంగళవారం అనంతపురంలో కూడా ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళిన జనసేన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, జనసేన పార్టీ ఎప్పుడూ బాధితుల పక్షాన నిలుస్తుందని, న్యాయం కోసం పోరాడే పార్టీ నాయకులను, శ్రేణులను అరెస్టులు, కేసులతో కట్టడి చేయాలని చూడడం మూర్ఖత్వం అవుతుందని మనోహర్ మండిపడ్డారు.