వైసిపి షోకాజ్ నోటీసుపై...తేల్చుకుంటానంటున్నఎంపి గీత
Recommended Video
వైసిపి తిరుగుబాటు ఎంపి కొత్తపల్లి గీతపై ఆ పార్టీ వేటే వేసేందుకు రంగం సిద్దం చేస్తోందా?...అంటే అవుననేట్లుగానే ఉన్నాయి తాజా పరిణామాలు. క్రమశిక్షణ చర్యల క్రింద ఎంపి గీతపై వేటు వేయాలని వైకాపా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. ఎలాగంటే?...
చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన
వైసిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు మీ సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ వైసీపీ చీఫ్ విప్ వైవీ సుబ్బారెడ్డి ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో ఎంపి కొత్తపల్లి గీత విషయం తాడో పేడో తేల్చేసేందుకు వైకాపా సంసిద్దమైనట్లు స్పష్టమైపోయింది. అయితే వైసీపీ చీఫ్ విప్ నోటీస్ ముందే ఊహించిన ఎంపి గీత అందుకు ధీటుగానే స్పందించినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటానని తిరుగు సమాధానం ఇచ్చింది.
మార్చి 20న...వైసిపి విప్ జారీ...
కేంద్రప్రభుత్వం పై వైసిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఎంపిలందరూ అందుకు కట్టుబడి ఉండాలంటూ ఈ నెల 20 తేదీన వైసీపీ చీఫ్ విప్ వైవీ సుబ్బారెడ్డి విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వైసిపి తరపున గెలిచి ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎంపిలు కొత్తపల్లి గీత, ఎస్సీవై రెడ్డి, బుట్టా రేణుక లకు కూడా ఈ విప్ వర్తిస్తుందన్న సంగతీ తెలిసిందే. దీంతో ఆ ముగ్గురు కూడా ఈ విప్ అందుకున్నట్లు తెలిసింది. తదనంతరం ఆ రోజు సభలో ఎంపి కొత్తపల్లి గీత మినహా మిగతా ఇద్దరు ఎంపీలు విప్ కు అనుగుణంగానే వ్యవహరించగా ఎంపి గీత మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారట. అందుకే ఆమెకు వైసిపి షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
ఆ రోజు ఏం జరిగిందంటే...అందుకేనట...
మార్చి 20 వైసిపి అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్ సభలో స్పీకర్ ఆ అవిశ్వాస తీర్మానం చదివి వినిపిస్తున్నపుడు వైసిపి సభ్యులందరూ లేచి నిలబడ్డారు. అయితే, అరకు ఎంపి కొత్తపల్లి గీత మాత్రం నిలబడలేదట. అందుకే విప్ ఉల్లంఘించిదంటూ మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఎంపి గీతకు విప్ వైవి సుబ్బారెడ్డి ఎంపికి షో కాజ్ నోటీసు జారీ చేసినట్లు చెబుతున్నారు. వారం రోజుల్లోగా మీ వివరణ ఇవ్వాలంటూ ఆ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.
షోకాజ్ పై ఎంపి గీత...రిప్లై
అయితే ఈ షోకాజ్ నోటీస్ వస్తుందని ఎంపి కొత్తపల్లి గీత ముందుగానే ఊహించారో ఏమో కానీ అలా సుబ్బారెడ్డి షోకాజ్ నోటీస్ అందించారో లేదో, ఎంపి గీత కూడా ఆ కాసేపటికే అందుకు రిప్లై ఇచ్చేశారు. నిజానికి షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు వారం రోజులు గడువు వున్నా టిట్ ఫర్ టాట్ చందంగా బదులివ్వాలని అనుకున్నారో ఏమో ఏ మాత్రం సందేహించకుండా ఎంపీ గీత వెంటనే షోకాజ్ నోటీస్ కు జవాబిచ్చేశారు. అంతేకాదు గీత ఇచ్చిన షోకాజ్ నోటీస్ వైసిపిపైనే ఎదురు దాడి చేసే విధంగా ఉండటం విశేషం.
ఎంపి గీత ఇచ్చిన రిప్లైలో...ఏముందంటే...
వైసిపి అవిశ్వాస తీర్మానం సభలో చదువుతున్నప్పుడు తాను సభకు హాజరయ్యానని పేర్కొన్నారు. అది తీర్మానానికి మద్దతుగా ఓటింగ్ జరిగే ప్రక్రియ కాదు కాబట్టి లేచి నిలబడలేదని, మిగిలిన ఎంపీలు కన్ఫ్యూజ్ అయి ఆ సమయంలో అవసరం లేకున్నా లేచి నిలబడ్డారని తెలిపారు. విప్ అనేది అవిశ్వాస తీర్మానంపై మద్దతు కోరే సమయంలోనే వర్తిస్తుందని...ఎంపి తాను లేచినిలబడలేదని పేర్కొన్న సమయంలో అసలు విప్ వర్తించదన్నారు. విప్ వర్తించే సమయంలో తాను అందుకు లోబడి సహకరిస్తానని తెలియజేశారు. విప్ వర్తించకున్నా తొందరపడి తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి, మానసిక క్షోభకు గురిచేయడానికే నని ఆరోపించారు. అయితే ఇలా తనను చర్యల పేరుతో ఇబ్బంది పెడితే సంబంధిత కార్యాలయం లేదా కోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. దీంతో ఎంపి కొత్తపల్లి గీత విషయంలో వైసిపి తదుపరి చర్య ప్రాధాన్యత సంతరించుకుంది.
మోడీకి థ్యాంక్స్...చెప్పిన ఎంపీ గీత
మరోవైపు ఎంపీ గీత గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. తన అరకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపేందుకే ఆయనను కలిసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది కూడా ఎక్కువ నిధులు ఇవ్వాలని ప్రధానిని కోరినట్లు ఆమె చెప్పారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి కూడా ప్రధానికి వివరించినట్లు తెలిపారు. విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తి న్యాయం చేస్తానని ప్రధాని మోడీ తనతో అన్నారని తెలిపారు. అంతేకాదు ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నానని మోడీ చెప్పినట్లు ఆమె తెలిపారు.