పవన్ కల్యాణ్ చెప్పిన అత్యాచారాలు టీడీపీ హయాంలో జరిగినవే..!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ రోజున అమరుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని అన్నారు. దేశం పట్ల బాధ్యతను గుర్తెరగాలని, ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలని చెప్పారు.
అలాంటి బాధ్యతే తనను ఈ రోజు ఇక్కడ ఈ స్థాయిలో నిలబెట్టిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యనించారు. మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని, పసికందులపై సైతం అత్యాచారాలు చేశారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంలో పవన్ సుగాలి ప్రీతీ కేసును మరోసారి ప్రస్తావించారు. చదువుకోవడానికి వెళ్లిన సుగాలి ప్రీతీ, శవం అయి ఇంటికి వచ్చిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

అయితే పవన్ కల్యాణ్ కామెంట్స్పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. సుగాలి ప్రీతీ అత్యాచార ఘటన 2017లో జరిగింది. అప్పుడు సీఎంగా చంద్రబాబు ఉన్నారనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. 2017లో కర్నూలులో సంచలనం రేపిన సుగాలి ప్రీతీపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై ఆమె తల్లి న్యాయపోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండటం ఈ కేసుపై అప్పటి ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ కేసును పెద్దగా పట్టించుకుంది లేదు.
ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ సుగాలి ప్రీతీ హత్యపై కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వం రాగానే సుగాలి ప్రీతీ హత్యపైనే మొదటి విచారణ చేపడతామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలైంది. ఆ మధ్య సుగాలి ప్రీతీ తల్లి పవన్తో భేటీ అయ్యారు. అయినప్పటికి ఈ కేసులో ఇప్పటి వరకు అడుగు ముందుకు పడింది లేదు.
ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన విషయాన్ని కూడా పవన్కు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల బాలికపై హైస్కూలు విద్యార్థులు ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై బాలికను కాల్వలోకి తోసేసి వెళ్లిపోయారు. ఆ పాప శవం అచూకి ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఇవ్వన్ని కూడా టీడీపీ ప్రభుత్వంలోనే జరిగాయనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పవన్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని వైసీపీ నేతలు కౌంటరిస్తున్నారు.












Click it and Unblock the Notifications