సర్వేలపైన చర్చకు సిద్దం: జాతీయ స్థాయిలోనూ జగన్ కీలకం: ఇదే చివరి కేబినెట్..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల పైన వస్తున్న సర్వేల పైన చర్చకు సిద్దమని ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లోనూ జగన్ కీలక పాత్ర పోషిస్తారన్నారు. ఇదే చివరి కేబినెట్ అని...సంతాప సభగా ఈ సమావేశాన్ని అభివర్ణించారు.
సర్వేలపైన చర్చకు సిద్దం..
చంద్రబాబు ఓడిపోతున్నామని తెలిసినా..రోజుకో రకంగా మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల్లో భ్రమ కల్పిస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ కొన ఊపిరితో ఉందని..పార్టీని కాపాడుకొనేందుకు చంద్రబాబు చివరి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వస్తామని చెబుతున్న చంద్రబాబు ఎన్ని సీట్లు వస్తాయో మాత్రం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని..సర్వేల పైన చర్చకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసారు. చంద్రబాబు తాను చేసింది తప్పని ఎన్నికల ఫలితాల తర్వాత ఒప్పుకోవాల్సి వస్తుందని తేల్చి చెప్పారు.

జాతీయ స్థాయిలోనూ జగన్ కీలకం..
జాతీయ స్థాయిలో చంద్రబాబు తీరు పైన అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు జాతీయ నేతలను కలిసి ఫొటోలను మాత్రమే తీసుకోగలుగుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ ఏపీలో అధికారంలోకి రావటంతో పాటుగా జాతీయ రాజకీయాల్లోనూ జగన్ కీలక పాత్ర పోపించబోతున్నారని జోస్యం చెప్పారు. ఎప్పుడూ ప్రజల సమస్యల పైన కేబినెట్ నిర్వహించని చంద్రబాబు కేవలం బిల్లుల కోసమే ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసారని ఆరోపించారు. ఇది చంద్రబాబు చివరి కేబినెట్ కాబోతుందన్నారు. ఈ నెల 23వ తేదీన ఫలితాల వెల్లడితో మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.












Click it and Unblock the Notifications