వైసీపి వంతు ఐపోయింది..!ఇక బీజేపి వంతు..! లోకేష్ కి విచిత్రమైన పేరు పెట్టిన కమలం నేత..!!
అమరావతి/హైదరాబాద్ : ప్రధాన ప్రతిపక్ష పార్టీ వంతు ఐపోయింది. ఇప్పుడు బీజేపి పార్టీ వంతు వచ్చేసింది. ఏపి ముఖ్యమంత్రి తనయుడు, లోకేష్ ని తిట్టేందుకు కాషాయపార్టీ కసరత్తు మొదలుపెట్టింది. లోకేష్ కు ఏపి బీజేపి నేత సోము వీర్రాజు ఓ విచిత్రమైన పేరు పెట్టేసారు. లోకేష్ ఓ తింగర మంగళం అంటూ సంభోదించారు.
కేంద్రం కియా కంపెనీని ఏర్పాటుచేస్తే అది తానే తెచ్చానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని సోము వీర్రాజు విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో, రాయడంలో చంద్రబాబు చిత్రగుప్తుడని ఎద్దేవా చేశారు. ఆయన కుమారుడు లోకేశ్ మంగళగిరి అనే పదాన్నే సరిగ్గా పలకలేకపోతున్నారనీ, లోకేశ్ ఓ తింగరి మంగళం అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చంద్రబాబు ఏపీని అవినీతి, తిరోగమనం వైపు విచ్చలవిడిగా నడిపారని మండిపడ్డారు. ఇసుక మైనింగ్ పై చంద్రబాబు అప్పనంగా 16,000 కోట్ల రూపాయలను మేసేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చొరవ కారణంగానే ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ, ఈవీఎంలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎన్నికలను ఈసీ జరిపిస్తుందా? లేక ఏపీ ప్రభుత్వం జరిపిస్తుందా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఏపీలో జరిగిన అభివృద్ధిపై ప్రజల వద్దకు వెళ్లకుండా చంద్రబాబు కొత్త వివాదాలు సృష్టిస్తున్నారనీ, యూటర్నులు ఎక్కువగా తీసుకుంటున్నారని దుయ్యబట్టారు.