పవన్ పై జగన్ అస్త్రంగా రాపాక : వైసీపీ కొత్త వ్యూహం : మూడు రాజధానులకు జై..!
జనసేన ఎమ్మెల్యే రాపాక పార్టీ అధినేతకు సమస్యగా మారుతున్నారు. పవన్ నిర్ణయాలకు భిన్నంగా ఆయన తన వాదన వినిపిస్తున్నారు. రాజధాని పైన స్పష్టత ఇవ్వాలని..పాలన మొత్తం ఒకే చోట ఉండాలని పవన్ వాదిస్తుంటే..జనసేన ఏకక ఎమ్మెల్యే రాపాక మాత్రం ముఖ్యమంత్రి నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారు. కొంత కాలంగా ముఖ్యమంత్రి తీసుకుంటన్న ప్రతీ నిర్ణయా నికి రాపాక మద్దతు తెలుపుతున్నారు.
కొన్ని సూచనలు మినహా అన్నింటినీ సమర్ధిస్తున్నారు. ఇక, కీలకమైన రాజధాని విషయంలో రాపాక అభిప్రాయం ఏంటో స్పష్టం చేసారు. ఇప్పుడు అసెంబ్లీలో ఇదే అంశం పైన ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టి..ఆమోదించే ప్రయత్నం చేస్తోంది. ఇదే రకంగా రాపాక ప్రభుత్వ నిర్ణయాన్ని సభలోనూ సమర్ధిస్తే..అది జనసేనానికి ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది.
మూడు రాజధానులకు రాపాక మద్దతు
మూడు రాజధానుల ప్రకటనను జనసేన ఎమ్మెల్యే సమర్థించారు. మూడు రాజధానుల నిర్ణయం సబబే అని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. నవరత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. మంచి చేస్తే మద్దతు ఇస్తామని... చెడు చేస్తే వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఇబ్బందే అని అయితే అమరావతి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే రాపాక తెలిపారు.
పవన్ అలా..ఎమ్మెల్యే ఇలా..
జనసేన అధినేత పవన్ రాజధాని అంశం పైన ఆచితూచి స్పందిస్తున్నారు. రాజకీయంగా ఏ ప్రాంతం నుండి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ముందుగా ప్రభుత్వం రాజధాని ఎక్కడో స్పష్టత ఇవ్వాల ని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఒప్పించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే అమరావతి రైతులకు తన మద్దతు ప్రకటించారు.
రాజధాని మీద ప్రభుత్వం అధకారికంగా నిర్ణయం తీసుకున్న తరువాత తన కార్యాచరణ వెల్లడిస్తానని స్పష్టం చేసారు. అయితే,పార్టీ ఎమ్మెల్యే మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. మూడు రాజధానులను స్వాగతించారు. గతంలో ఇంగ్లీషు మీడియం స్కూళ్ల విషయంలోనూ ఇదే రకంగా సభలోనే ప్రభుత్వానికి రాపాక మద్దతు తెలిపారు. సీఎం ఫొటోలకు మంత్రితో కలిసి పాలాభిషేకం లో జనసేన ఎమ్మెల్యే పాల్గొనటం సంచలనంగా మారింది. ఆయన పైన చర్య లు తీసుకోవాలనే డిమాండ్ పార్టీలో వ్యక్తమైంది.
సభలో జగన్ కు అస్త్రంగా...
ఇక, ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వం శాసనసభలో తీర్మానం ఆమోదించటం ద్వారా తమ ఆలోచనలను అమలు చేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో సభలో వైసీపీ తో పాటుగా టీడీపీ..జనసేన మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసినా.. సభలో జనసేన నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఇప్పుడు వ్యక్తం చేస్తున్న అభిప్రాయమే సభలోనూ వ్యక్తం చేయటం ద్వారా..అది జనసేన వాయిస్ గా సభా రికార్డుల్లో నిలుస్తుంది.
దీని ద్వారా తమ ఆలోచనలను జనసేన మద్దతు ఇచ్చిందని చెప్పుకొనే వెసులుబాటు ప్రభుత్వానికి ఏర్పడుతుంది. దీని ద్వారా పవన్ ను ఇరుకున పెట్టాలని వైసీపీ భావిస్తోంది. మరి.. పవన్ దీనిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.