Year Ender 2024: వైసీపీ జాతకం మార్చేసిన ఏడాది-ఐదేళ్ల జైత్రయాత్రకు చెక్..!
ఏపీ రాజకీయాల్లో ఈ ఏడాది పెను సంచలనాలు నమోదు చేసింది. ఇందులో సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా తిరగబడిన వైసీపీ జాతకం కూడా ఒకటి. ఎన్నికల ముందు వరకూ దుర్బేద్యంగా కనిపించిన వైసీపీ సర్కార్ ఐదేళ్ల పాలనలో చేసిన తప్పిదాలకు ఓటర్లు తెలిపిన ఆగ్రహానికి కకావికలైంది. గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అదే సమయంలో జగన్ తప్పిదాల్ని జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయిన కూటమి 164 సీట్లతో పటిష్టంగా మారిపోయింది.
ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎవరిని అడిగినా కచ్చితంగా కూటమి గెలుస్తుందని చెప్పే పరిస్ధితి లేదు. అలాగే వైసీపీ కచ్చితంగా ఓడిపోతుందని చెప్పే పరిస్ధితి లేదు. కానీ ఎన్నికల కంటే ఎంతో ముందు జట్టు కట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైసీపీ పరాజయానికి బాటలు వేశారు. ముఖ్యంగా గత ఐదేళ్లలో వైసీపీ చేసిన తప్పిదాలను జనంలోకి తీసుకెళ్లడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. అది ఏ స్దాయిలో ఉందంటే వైసీపీ చేసిన మంచి చెప్పినా జనం నమ్మని పరిస్ధితిలోకి నెట్టేశారు. దీంతో ఎన్నికలు పూర్తి ఏకపక్షంగా మారిపోయాయి.

గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను భారీ ఎత్తున అమలు చేసింది. అలాగే ఎన్నికలకు ముందే ఈ వార్ పేదలు వర్సెస్ పెత్తందారులంటూ జగన్ ఊరూరా ఊదరగొట్టారు. అయితే జనం మాత్రం అంతలా విడిపోతారని అనుకోవడం తప్పిదంగా మారింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల లబ్దిదారులు వర్సెస్ ఇతరులుగా పరిస్ధితిని మార్చాలనుకున్న జగన్ ఎత్తుల్ని జనం నమ్మలేదు. అలాగే ఎన్నికల హామీల్ని నిలబెట్టుకోవడంలో పూర్ రికార్డు ఉన్న చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్ని సైతం జనం నమ్మేశారు. ఏదో విధంగా జగన్ గద్దెదిగిపోతే చాలు రాష్ట్రంలో అన్నీ మారిపోతాయన్న విశ్వాసం ఓటర్లలో కల్పించడంలో కూటమి పార్టీలు సక్సెస్ అయ్యాయి. దీంతో వైసీపీ జాతకం పూర్తిగా తిరగబడిపోయింది.












Click it and Unblock the Notifications