టి ఓ 'మహాభారతమే': గండ్ర, బాబు నిషేధించారని హరీష్
హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు తెలంగాణ ముసాయిదా బిల్లు పైన మాట్లాడుతూ మహాభారతాన్ని ప్రస్తావించారని, దానికి తాను అంగీకరిస్తున్నానని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి గురువారం అన్నారు. బిల్లు పైన శాసన సభలో హాట్ హాట్గా చర్చ జరిగింది.
నాడు పాండవులు తమ న్యాయమైన హక్కుల కోసం అడిగితే, తాము ఎక్కువ మందిమి ఉన్నామని కౌరవులు ఎలా పెడ చెవిన పెట్టారో, నేడు అలాగే జరుగుతోందన్నారు. తమకు న్యాయంగా రావాల్సిన దానిని అడిగితే మహాభారత యుద్ధం వచ్చిందని, అందులోని భాగమే ఇది అన్నారు. భారత యుద్ధంతో పోల్చినందుకు సంతోషమన్నారు.
ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చారిత్రకమైన రోజు అన్నారు. ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. అన్ని పార్టీలతో సంప్రదించాకనే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వం కోసం ప్రజాస్వామ్యబద్దంగా పోరాటం చేశారన్నారు. ప్రజల ఆకాంక్ష తెలియజేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణ ఏర్పాటు జరుగుతోందని చెప్పడం సరికాదన్నారు. 2004లో కాంగ్రెసు, 2009లో టిడిపి తెలంగాణ పేరు చెప్పి ఎన్నికలకు వెళ్లాయని తెలిపారు. టిడిపికి అధికార యావ తప్ప మరొకటి లేదన్నారు. కాంగ్రెసు పార్టీ ఆవేశంతో నిర్ణయం తీసుకోలేదన్నారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా టిడిపి తీరు ఉందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ పేరు ఎత్తడమే నిషేధంగా ఉండేదని ఆరోపించారు.
అబద్దాలు: ఎర్రబెల్లి
తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తింది వైయస్ రాజశేఖర రెడ్డి అని ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. తెలంగాణ విషయంలో తమ నేత చంద్రబాబు ఇచ్చిన మాట నుండి వెనక్కి తగ్గలేదన్నారు. గండ్ర సభలో అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తమ పైన, తమ నేత పైన ఆరోపణలు చేసినందువల్ల తాను వివరణ ఇస్తున్నానన్నారు. కాంగ్రెసు, తెరాస కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాటపై వెనక్కి పోలేదని, విద్యార్థులు చనిపోతుంటే సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారన్నారు. హైదరాబాద్, వరంగల్.. ఇలా అన్ని ప్రాంతాలు చంద్రబాబు హయాంలో అభివృద్ధి అయ్యాయన్నారు.
సిగ్గు రగడ
టిడిపి నేత ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సిగ్గుందా అన్నారు. దీనిపై గండ్ర మండిపడ్డారు. ఎర్రబెల్లి సిగ్గుందా అనడం సరికాదన్నారు. ఆయన మాటలను రికార్డుల నుండి తొలగించాలన్నారు.
తెలంగాణను నిషేదించలేదా?: హరీష్
తెలంగాణ అనే పదాన్ని నిషేదించింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాదా అని తెరాస శాసన సభ్యులు హరీష్ రావు అన్నారు. చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచారనే పేరుందన్నారు.
అసెంబ్లీ రేపటికి వాయిదా
అసెంబ్లీలో గందరగోళం చెలరేగడంతో సభాపతి సభను రేపటికి వాయిదా వేశారు.