చంద్రబాబు ఓటమిపై ఆవేదనలో అభిమానులు .. ఓదారుస్తున్న చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పేదలకు, మహిళలకు , అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించారు. ఆ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నమ్మారు. ఆడబిడ్డలు ఆదరిస్తారని భావించారు. కానీ అనూహ్యంగా వైసీపీ విజయం సాధించింది. చంద్రబాబు ఓటమి పాలయ్యారు. ఇప్పటికే టీడీపీ ఘోర ఓటమిని జీర్ణించుకోలేకపోతుంది. భవిష్యత్ కార్యాచరణ విషయంలో కూడా స్తబ్దంగా ఉంది.
జగన్ సీఎం కాక ముందే నవరత్నాలలో మూడు రత్నాలు రాలిపోయాయి -అయ్యన్న పాత్రుడు ఫైర్
పార్టీ శ్రేణులకు, నాయకులకు ధైర్యం చెప్తున్న చంద్రబాబు
ఇప్పుడిప్పుడే కోలుకునే యత్నం చేస్తున్న చంద్రబాబు పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్తున్నారు. ఎవరూ బాధ పడొద్దని , ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండే పార్టీ తమదని ఆయన పార్టీ శ్రేణుల్లో కాస్త ధైర్యం నూరిపోస్తున్నారు.ఇక పార్టీ కార్యాకలాపాలు గుంటూరు కార్యాలయం నుండి నిర్వహించాలని నిర్ణయించిన చంద్రబాబు ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. జగన్ మీద సానుభూతే గెలిపించిందని , టీడీపీ మీద ప్రజల్లో కోపం లేదని చెప్పిన బాబు ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. కానీ చాలా మంది చంద్రబాబు ఓటమిని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు వద్ద కొందరు మహిళలు బోరుమన్నారు.
చంద్రబాబు ఓటమిపై బాబును కలిసి ఆవేదన చెందుతున్న అభిమానులు
పేదలకు ఎంతో చేసిన నువ్వు ఓడిపోవడం మేమిచ్చిన తీర్పు కాదు. మిషన్లు ఇచ్చిన తీర్పు అని చంద్రబాబు వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్పారు. తాము ఓట్లు వేశామని అయినా గెలవకపోవటం ఏమిటని ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు .చంద్రబాబును కలిసేందుకు అమరావతికి వచ్చిన టీడీపీ అభిమానులు ,మహిళలు చంద్రబాబు ఓటమిపై కన్నీటి పర్యంతం అయ్యారు . తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవాన్ని తట్టుకోలేకపోతున్న పలువురు, చంద్రబాబును కలిసి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఎందరికో ఇళ్లు ఇచ్చినా, నెలవారీ పింఛన్లు ఇచ్చి వారిని ఆదుకున్నా, టీడీపీ ఓడిపోయిందంటే నమ్మలేకున్నామని, ఇదంతా ఏదో మాయగా ఉందని వారంటున్నారు. ఇది తామిచ్చిన తీర్పు కాదని వాపోయారు మహిళలు .
తన వద్ద బోరుమంటున్న వారిని ఓదార్చి ధైర్యం చెప్తున్న చంద్రబాబు
ఇక తన కోసం దుఃఖిస్తున్న వారిని చూసి చలించిపోయిన చంద్రబాబు వారిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి, అందరికీ మళ్లీ మంచి రోజులు వస్తాయని చంద్రబాబు చెప్తున్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని , నిబ్బరంగా ఉండండని చెప్పి పంపుతున్నారు. కానీ చంద్రబాబే భవిష్యత్ కార్యాచరణ అర్ధం కాని సందిగ్ధ స్థితిలో ఉన్నారు. పార్టీని కాపాడటం ఎలాగా అన్న సంకట స్థితిలో పడ్డారు .