మీ రాజకీయ సమాధి దగ్గరలోనే .. రాష్ట్రాన్ని పులివెందుల చేస్తారా : చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు . ఆంధ్రప్రదేశ్ లో అరాచకం రాజ్యమేలుతుందని ఆయన పేర్కొన్నారు .అరాచకాలు చేసి గెలవాలనుకుంటే ఖబడ్దార్ .. జాగ్రత్త అంటూ చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయితీ చేస్తారా అని చంద్రబాబు నిలదీశారు. రాజకీయంగా మీరు సమాధి అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు చంద్రబాబు .
పులివెందులలో పోటీచేసే మగాళ్లు లేరా ? ఏంటీ అరాచకం
సీఎం జగన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం గెలవాలని పిలుపు ఇచ్చాడని, దాంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారని ధ్వజమెత్తారు. కడపలో ప్రజాస్వామ్యం ఎక్కడుందో వెతుక్కోవాల్సి వస్తోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.పులివెందులలో పోటీచేసేనాథుడే లేరని అక్కడ మగాళ్లు లేరా అని ఇదెక్కడి దారుణం అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ నేతలు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, బలవంతంగా నామినేషన్ పత్రాల్ని లాక్కున్నారని మహిళలతో కూడా అనుచితంగా ప్రవర్తించిన తీరు దారుణం అని ఆయన అన్నారు.
టీడీపీ నేతలపై హత్యాయత్నం చేసినా చట్టాన్ని అమలు చేసే పరిస్థితి ఇదేనా?
మాచర్లలో టీడీపీ నేతలపై హత్యాయత్నం చేస్తే నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచమైన రాజకీయాలు చెయ్యటం సీఎం జగన్ కే సాధ్యమని , ప్రజలను ఎందుకు ఇంతగా వేధిస్తున్నారని ప్రశ్నించారు చంద్రబాబు . ఇక బాహాటంగా టీడీపీ నేతలపై హత్యాయత్నం చేసినా చట్టాన్ని అమలు చేసే పరిస్థితి ఇదేనా? అని ప్రశ్నించారు.
38 ఫిర్యాదులు ఇస్తే ఇప్పటివరకు టైమ్ లేదని చెబుతారా ?
రాజధాని రైతులను మాత్రం రోజులతరబడి జైల్లో పెట్టారని, చట్టం కొందరికి చుట్టంగా మరి కొందరికి శాపంగా మారిందని పేర్కొన్నారు. ఈ అరాచకాలు ఎన్నికల కమిషన్కు కనిపించవా అని మరోసారి ప్రశ్నించారు. 38 ఫిర్యాదులు ఇస్తే ఇప్పటివరకు టైమ్ లేదని చెబుతారా నిలదీశారు. ఇక వైసీపీ నేతలకు తప్పు చేస్తున్నామన్న సిగ్గుకూడా లేదా అని ధ్వజమెత్తారు. తనను అరెస్ట్ చేయడంపై సమాధానం చెప్పమని డీజీపీని కోర్టు అడిగిందని అయినాసరే ఇంకా మార్పు రాదా అని చంద్రబాబు గుర్తుచేశారు.
మాచర్ల మీ బందిపోటులకు స్థావరమా?
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని హైకోర్టు అక్షంతలు వేస్తున్నా సిగ్గు లేదా అని ప్రశ్నించారు . మీ దౌర్జన్యాలు, ఉన్మాద చర్యల్ని సాగనివ్వమని చెప్పిన చంద్రబాబు టీడీపీ నేతలను పోటీ చెయ్యకుండా దాడులు చేశారని, మాచర్ల మీ బందిపోటులకు స్థావరమా అని ప్రశ్నించారు. మాచర్లలో ఒక్క వార్డులో నామినేషన్ వేయలేకపోయామని, ఎన్నికల కమిషన్కు సిగ్గు లేదా అని నిలదీశారు. పోలీసులు వైసీపీకి వంతపాడుతారా అని మండిపడ్డారు.