భార్య, అత్త వేధింపులు: కోర్టు ఆవరణలో యువకుడి ఆత్మహత్యాయత్నం
ఏలూరు: భార్య, అత్త వేధింపులు భరించలేక కోర్టు ఆవరణలోనే ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన ప్రేమ్ కిషోర్(28) 2011లో ఏలూరుకు చెందిన నాగలక్ష్మిని వివాహం చేసుకున్నాడు.
కొంతకాలం తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో భర్త ప్రేమ్ కిషోర్పై నాగలక్షి వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో పోలీసులు ప్రేమ్ కిషోర్ను అరెస్ట్ చేశారు. కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. కిషోర్కు ఎటువంటి కట్నం ఇవ్వకుండానే రాజీ కోసం రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని భార్య నాగలక్ష్మి, అత్త రాజేశ్వరి కిషోర్ను బెదిరించసాగారనే ఆరోపణలు ఉన్నాయి.

దానికి తోడు కోర్టు ఆవరణలోనే పలుమార్లు కిషోర్ తల్లిని వ్యభిచారంటూ అవహేళన చేశారు. దీంతో మనస్తాపం చెందిన కిషోర్ సోమవారం కోర్టు వాయిదాకు వస్తూ ఆరు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. భార్య, అత్త వేధింపులు భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన కుటుంబ స్తోమత నెలకు 4వేల రూపాయలు మాత్రమేనని, కానీ రాజీ కోసం రెండు లక్షలు ఇవ్వమంటున్నారని మొబైల్ మెజిస్ట్రేట్కు రాసిన నోట్లో వివరించాడు.
తనను వేధించిన భార్య, అత్తపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్లో కోరాడు. కొద్దిసేపటి క్రితం వాయిదా కోసం మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టుకు వచ్చిన అతను అక్కడే పురుగుల మందు తాగి పడిపోయాడు. పక్కనే ఉన్న కానిస్టేబుల్ గమనించి వెంటనే అతడిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. కిశోర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications