శోభనం రాత్రే ఆ యువకుడికి కాళరాత్రి
కాకినాడ: తొలి రాత్రే ఓ యువకుడికి కాళరాత్రి అయింది. కారణం ఏమిటో తెలియదు గానీ శోభనం రోజునాడే వరుడు దారుణహత్యకు గురైన సంఘటన శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మన్యంలో చోటు చేసుకుంది. రాజవొమ్మంగి మండలంలో జడ్డంగి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న పాత వెలగలపాలెంలో సోమాల రాజు(25) దారుణ హత్యకు గురయ్యాడు.
గోకవరం మండలం కామరాజుపేటకు పంచాయతీ శివరామపట్నానికి చెందిన రాజుకి, పాత వెలగలపాలెం గ్రామానికి చెందిన పాడి రామలక్ష్మిలకు ఈ నెల 22 రాత్రి శివరామపట్నంలో వివాహమైంది. వివాహం అనంతరం గిరిజనులైన వీరిని వెలగలపాలెం గ్రామానికి గురువారం తీసుకొచ్చారు.

శుక్రవారం రాత్రి వీరికి రామలక్ష్మి ఇంటివద్దే శోభనం ఏర్పాటు చేశారు. శనివారం తెల్లవారే సరికి రాజు శవమై మంచంపై కనిపించాడు. రాజు మెడపై, ఛాతిపై, నడుముపై గాయాలున్నాయి. రాజు మర్మాంగంపై గాయాలతో బాటు రక్తం కూడా కారుతూ కనిపించింది. శవంపై కనిపిస్తున్న ఆనవాళ్ల ప్రకారం ఇది ముమ్మాటికీ హత్యగానే కనిపిస్తోంది. తనకు ఏమీ తెలియదని, తెల్లవారుఝామునే తాను గది నుండి బయటకు వచ్చేశానని, ఉదయం టీ ఇచ్చేందుకు వెళ్లగా, రాజు అచేతనంగా పడి ఉన్నాడని వధువు రామలక్ష్మి చెబుతోంది.
ఒకరు కంటే ఎక్కువ మంది ఈ హత్య చేసి ఉండవచ్చని, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలియడంలేదని, మొదటిరాత్రి కూడా జరిగి ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాజు బంధువుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐ మోహన్రెడ్డి వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఇరువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications