వైఎస్ అవినాష్ కు గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్లు- తల్లి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు హాజరు కావడం లేదు. గుండెపోటుతో తన తల్లి కర్నూలు ఆస్పత్రిలో చేరడంతో అక్కడే ఉన్న ఆయన.. ఆమెను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అవినాష్ తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యంపై డాక్టర్లు కూడా ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్లు విడుదల చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ తాజా బులిటెన్ విడుదల చేశారు.
వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి హెల్త్ బులిటెన్ లో డాక్టర్లు ఆమె ఆరోగ్యం గత మూడు రోజులుగా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఆమెకు వాంతులు తగ్గాయని కూడా తెలిపారు. ఆమెకు నిర్వహించిన అల్ ట్రా సౌండ్ పరీక్షలో కూడా ఎలాంటి సమస్యలు బయటపడలేదన్నారు. అలాగే నోటి నుంచి ఆహారం తీసుకుంటున్నారని కూడా డాక్టర్లు వెల్లడించారు. ఆమె శరీరంలో కీలక అవయవాలు మెరుగ్గానే ఉన్నట్లు తెలిపారు. అలాగే ఐసీయూ నుంచి సాధారణ రూములోకి మారుస్తామని కూడా డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత మరికొన్ని పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు.

మరోవైపు తల్లి ఆరోగ్యం మెరుగు పడిన తర్వాత తాను సీబీఐ విచారణకు హాజరవుతానని ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డి చెబుతున్నారు. ఆలోపు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ అవినాష్ బెయిల్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ కూడా జరగబోతోంది. ఇందులో హైకోర్టు ప్రకటించే నిర్ణయం ఆధారంగా తదుపరి అడుగులు వేసేందుకు సీబీఐ కూడా సిద్ధమవుతోంది.
ఇప్పటికే సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ముందస్తు బెయిల్ కోరినా ఫలితం లేకపోవడంతో తిరిగి తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ ను అవినాష్ ఆశ్రయించారు. ఇక్కడ ఊరట లభించకపోతే మాత్రం సీబీఐ విచారణ ఎదుర్కొనేందుకు అవినాష్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు రెగ్యులర్ బెంచ్ అవినాష్ పిటిషన్ పై జూన్ 5న విచారణ జరిపేందుకు ఇప్పటికే అంగీకరించింది.












Click it and Unblock the Notifications