Jagan 2.0: వైసీపీలోకి కర్నూలు టీడీపీ, బీజేపీ కీలక నేతలు..!
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ జగన్ ప్రతిపక్ష హోదా తెరపైకి రావడం, హైకోర్టులో పిటిషన్లు, వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించేందుకు సమాలోచనల నేపథ్యంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి బయటికి పోయే నేతలే తప్ప ఆ పార్టీలోకి వచ్చే వారే కరువయ్యారు. ఇలాంటి సమయంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన కూటమి పార్టీల నేతలు ఇవాళ వైసీపీలో చేరారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ బీజేపీ, టీడీపీ నాయకులు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ వైసీపీలో చేరిన వారిలో కె.ఆర్.మురహరి రెడ్డి (ఎమ్మిగనూరు బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్), కిరణ్ కుమార్ (బీజేపీ ఎమ్మిగనూరు టౌన్ ప్రెసిడెంట్), మాల మధుబాబు (టీడీపీ మాజీ కౌన్సిలర్ - ఎమ్మిగనూరు), చేనేత మల్లికార్జున (టీడీపీ ఎమ్మిగనూరు సిటీ జనరల్ సెక్రటరీ) ఉన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, పలువురు కర్నూలు జిల్లా నాయకులు పాల్గొన్నారు. జగన్ స్వయంగా టీడీపీ, బీజేపీ నేతల్ని పార్టీలోకి ఆహ్వానించి కండువాలు కప్పారు. అలాగే వైసీపీలో మళ్లీ చేరికలు మొదలుకావడంతో క్యాడర్ లో సంతోషం నెలకొంది. కొంతకాలంగా జగన్ 2.0 పేరుతో ప్రచారం చేస్తున్నా అధికార కూటమి నుంచి నేతల చేరికలు మాత్రం లేవు. కానీ ఇప్పుడు సీమ జిల్లాలకు చెందిన టీడీపీ, బీజేపీ నాయకులు పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications