అంచనా లేవి: హుధుద్ తుఫాన్ నష్టంపై జగన్
విజయనగరం: హుధుద్ తుఫాను ప్రభావంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, అయితే అక్కడి పరిస్థితులను అధికారులు సరిగా అంచనా వేయలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చాలా గ్రామాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు రాలేదన్న విషయాన్ని బాధితులు తన దృష్టికి తెచ్చినట్లు ఆయన తెలిపారు.
సోమవారంనాడు ఆయన విజయనగరం జిల్లా బోగాపురం మండలం దిబ్బలపాలెం గ్రామంలో పర్యటించారు. నవంబర్ 5వ తేదీలోగా బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అలా ముందుకు రాకపోతే డ్వాక్రా, రైతు రుణమాఫీ దీక్షలు చేయడమే కాకుండా ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని జగన్ హెచ్చరించారు.
ఫైబర్ బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు రూ.2.50 లక్షల నష్టపరిహారంతో పాటు వలలో కోల్పోయినవారికి రూ.50 వేలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొబ్బరి తోటలు కోల్పోయినవారికి చెట్టుకు రూ.5 వేల చొప్పున ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
జీడిమామిడి తోటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నష్టపరిహారం పేరుతో ఎప్పుడూ ఇచ్చే రూ.25కు 25 కేజీల బియ్యాన్ని మాత్రమే ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఒక్క అధికారి కూడా రాలేదని బాధితులు చెప్పినట్లు ఆయన తెలిపారు.
ఒక వేళ వచ్చినా వారికి నచ్చినవారి పేర్లు రాసుకుని వెళ్లిపోవడం ఎంత వరకు సమంజసమని ఆయన అడిగారు. తుఫాను వ్లల దెబ్బ తిన్న ఇళ్లకు రూ.50 వేల చొప్పున ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తిగా ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్వించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా వైయస్ జగన్ తుఫాను తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.