వెన్నుపోటు మీ రక్తంలోనే ఉంది.., ఆర్నెళ్లుగా చంద్రబాబు ఫాలో అవుతున్న సిద్దాంతం ఇదే: జగన్
అమరావతి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 121వ రోజు మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రాజకీయ వైఖరిపై ఆయన నిప్పులు చెరిగారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అంతా అబద్దాలు, మోసాలమయం అని ఆరోపించారు. హోదా ప్యాకేజీ రెండూ ఒకటే అంటూ అప్పుడు జైట్లీని పొగిడి.. ఇప్పుడు మాత్రం ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నావా? అంటూ కడిగిపారేశారు.
వెన్నుపోటు మీ రక్తంలోనే ఉంది:
అఖిల పక్షాన్ని పిలవాలనే విషయం కూడా ఇవాళే గుర్తుకొచ్చిందా? అంటూ చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. వెన్నుపోటు పొడవడమనేది మీ రక్తంలోనే ఉందని.. ప్రజలు మిమ్మల్ని ఎలా విశ్వసించాలి? అని నిలదీశారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే తమ పార్టీ ఎంపీల మాదిరి పార్లమెంట్ ముగిసే చివరి రోజున టీడీపీ ఎంపీల చేత కూడా రాజీనామా చేయించాలని జగన్ సవాల్ విసిరారు.
దొంగే దొంగ అన్నట్టుంది..:
నాలుగేళ్లు గడిచిపోయాక.. తీరా ఇప్పుడు అఖిలపక్షాన్ని పిలుస్తానని, దశా దిశా చెబుతానని చంద్రబాబు అంటంటే.. దొంగే 'దొంగ.. దొంగ..' అంటున్నట్టుగా ఉందన్నారు జగన్. తాను సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నానని.. ఈ నెల 16వ తేదీన కేంద్రంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టి ఉండకపోతే మీరు పెట్టేవారా? అని ప్రశ్నించారు. సంఖ్యా బలం ఉంటే మద్దతునిస్తామని చెప్పి ఆ తర్వాత మాట మార్చడమేంటని ప్రశ్నించారు.
ఊసరవెల్లి రాజకీయాలు..
ఇప్పటికీ చంద్రబాబు ఎవరితోనూ మాట్లాడలేదని, అయినా టీడీపీ అవిశ్వాసానికి అన్నీ పార్టీలు మద్దతునిస్తున్నాయని చెప్పుకుంటున్నారని జగన్ ఆరోపించారు.
ఇదంతా ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చడం లాగా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పూటకో మాట మార్చి... రోజుకో వేషం వేసే పెద్దమనిషి ఇవాళ అఖిల పక్షాన్ని పిలుస్తాడట! దానికి ఆయన నాయకత్వం వహిస్తాడట! అంటూ ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నమ్మిన సిద్దాంతం:
తన రాజకీయాల కోసం చంద్రబాబు ఓ సిద్దాంతం కనిపెట్టాడని.. 'ప్రజలను నమ్మించు.. ప్రజలను వంచించు.. ప్రజలను వెన్నుపోటు పొడువు.. ఆ నెపాన్ని మరొకరిపైకి నెట్టు.. అనుకూల మీడియాను వాడుకుని దీన్ని ప్రచారంలో పెట్టు' అన్నదే ఆ సూత్రమని జగన్ ఎద్దేవా చేశారు. ఆరు నెలలుగా ఆయన ఇదే పని చేస్తున్నారని, తప్పులన్నింటినీ కేంద్రం పైకి నెట్టేసి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు.