ఓటుకు నోటు కేసు: బాబే A1 ముద్దాయి(ఫోటోలు)
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబును A 1 ముద్దాయిగా చేర్చాలని కోరుతూ గవర్నర్ నరసింహన్కు వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్ వినతిపత్రం సమర్పించారు. రాజ్భవన్లో మంగళవారం పార్టీ ప్రతినిధులతో కలసి ఆయన గవర్నర్ నరసింహన్ను కలిశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అవినీతి, కుట్ర, నేరపూరిత రాజకీయాలు ఓటుకు నోటు కేసుతో బయటపడిందని అన్నారు. ఈ వ్యవహారంలో చంద్రబాబును మొదటి ముద్దాయిగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబే A1 ముద్దాయి: జగన్
చంద్రబాబుకు బుద్ధి రావాలనే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చామని వైయస్ జగన్ చెప్పారు. అయితే.. తమ మద్దతు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలకే పరిమితం అవుతుందని అన్నారు. ప్రజా సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక పార్టీ తమదేనని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు వైయస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై తమ పార్టీ దిగజారిపోయిందంటూ విజయవాడలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

చంద్రబాబే A1 ముద్దాయి: జగన్
మహానాడు మూడు రోజుల సదస్సులో అవినీతిని అరికట్టే విషయమై బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇచ్చిన మర్నాడే చంద్రబాబు ఒక ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేందుకు అనైతిక విధానాలకు పాల్పడ్డారన్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్లు చేశారన్నారు. ఈ కేసులో చంద్రబాబునాయుడుపై కేసు నమోదు చేయాలని, కేసును విచారించిన కోర్టు తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.
చంద్రబాబే A1 ముద్దాయి: జగన్
టిడిపి నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప, అంత పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చితే తప్ప రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి వెళ్లరన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పలు అవినీతి చర్యలకు చంద్రబాబు పాల్పడుతున్నారన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో కాంట్రాక్టర్లకు అదనంగా లబ్ధి చేకూర్చే విధంగా జీవో 22ను జారీ చేశారన్నారు.

చంద్రబాబే A1 ముద్దాయి: జగన్
అలాగే కొన్ని డిస్టలరీస్ను ఎంపిక చేసి ఆ సంస్ధల యాజమాన్యాలకు ప్రయోజనం చేకూర్చినందుకు సొమ్ము చేతులు మారిందన్నారు. ఇసుక మాఫియాతో కూడా టిడిపి ప్రభుత్వానికి సంబంధం ఉందన్నారు. రాజధాని ప్రాంతంలో స్విస్ చాలెంజ్ పద్ధతి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రపంచ మంతా బొగ్గు ధరలు తగ్గితే, ఏపిలో మాత్రం బొగ్గు ధరలు పెంచి కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చారన్నారు.
చంద్రబాబే అసలు సూత్రధారి అని, ఆయనను A 1గా ఎందుకు చేర్చలేదో అర్థం కావడం లేదన్నారు. గెలిచే అవకాశం లేకపోయినా ఓటుకు నోటు వ్యవహారాన్ని ప్రోత్సహించడం ద్వారా చంద్రబాబు ఎలాంటి ధన రాజకీయాలకు పాల్పడుతున్నారో స్పష్టమవుతోందని జగన్ విమర్శించారు.
ఈ కేసు దర్యాప్తులో ఏసిబి పోలీసులు ఎవరి వత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి అసలు నిందితులను పట్టుకోవాలన్నారు. రాష్ట్ర గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని చట్టం ముందు అసలైన దోషులు నిలబెట్టే విధంగా పోలీసు శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications