ముస్లిం నేతలతో జగన్, చంద్రబాబు వరుస భేటీలు- ఆ కీలక నిర్ణయం కోసం ?
ఏపీలో ఇవాళ సీఎం వైఎస్ జగన్, విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా ముస్లిం నేతల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఓ కీలక మైన నిర్ణయం తీసుకునేందుకు వీరిద్దరూ రాష్ట్రంలో ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు నేతల్ని, ప్రజాప్రతినిధుల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఇవాళ వరుస సమావేశాల తర్వాత జగన్, చంద్రబాబు ఆ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) బిల్లు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. దీన్ని దేశవ్యాప్తంగా ముస్లింలంతా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోనూ ముస్లింలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేపీకి పరోక్షంగా మద్దతిస్తున్న వైసీపీ, టీడీపీ ఈ విషయంలో ముస్లింల అభిప్రాయం తీసుకోకుండా, వారి మనోభావాలకు వ్యతిరేకంగా బీజేపీకి మద్దతిచ్చే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం పడుతుంది. దీంతో ఇవాళ జగన్, చంద్రబాబు ఇద్దరూ ముస్లిం నేతలతో భేటీ అవుతున్నారు.

ఉమ్మడి పౌరస్మృతిని కేంద్రం అమలు చేస్తే తీవ్రంగా వ్యతిరేకించేందుకు దేశవ్యాప్తంగా ముస్లింలు సిద్దమవుతున్నారు. ఇప్పటికే లా కమిషన్ చేపట్టిన అభిప్రాయ సేకరణకు ముస్లింలు లక్షల సంఖ్యలో తమ అభిప్రాయాలు పంపారు. ఇంకా పంపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో కేంద్రం తీసుకొచ్చే బిల్లు కచ్చితంగా తమ మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని భావిస్తున్నారు. కానీ బీజేపీకి భయపడి వైసీపీ,టీడీపీ ఈ బిల్లుకు మద్దతిచ్చే కచ్చితంగా ముస్లింల నుంచి ప్రతిఘటన తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో జగన్, చంద్రబాబు వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన ఈ బిల్లుకు మద్దతుగానే ఉంది. పార్లమెంటులో ప్రతినిధులు లేకపోవడంతో జనసేనపై ఈ బిల్లు ప్రభావం తక్కువగా ఉంటుంది. కానీ వైసీపీ, టీడీపీకి అలా కాదు. అలాగే అత్యధిక ఎంపీలున్న వైసీపీపై ఈ బిల్లు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగని ఈ బిల్లును వ్యతిరేకిస్తే కీలక సమయంలో ఎన్డీయేకు ఎదురుదెబ్బ తప్పదు. కాబట్టి వైసీపీ, టీడీపీ ఈ విషయంలో ఏం చేయబోతున్నాయనే ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications