రేపు నవీన్ పట్నాయక్ వద్దకు జగన్-కొటియా, జంఝావతి అజెండా- తేల్చేస్తారా ?
ఏపీ, ఒడిశా మధ్య వివాదాస్పద అంశాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కొటియా గ్రామాలు, జంజావతి డ్యామ్, పోలవరం డ్యామ్ నిర్మాణంపై వివాదాలు నడుస్తున్నాయి. దీంతో నిత్యం వీటిలో ఏదో ఒక అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరోవైపు ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో గంజాయి సాగు, రవాణాపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ సమస్యలపై చర్చించేందుకు రేపు ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. తొలిసారి ఇరు సీఎంలు భేటీ కానుండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఏపీ-ఒడిశా వివాదాలు
పొరుగు రాష్ట్రాలైన ఏపీ-ఒడిశా మధ్య వివాదాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ముఖ్యంగా సరిహద్దుల్లోని కొటియా గ్రామాలపై దశాబ్దాలుగా సమస్య కొనసాగుతోంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. అప్పటివరకూ ఏపీలో ప్రభుత్వాలు దీన్ని చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండగా.. జగన్ వచ్చాక మాత్రం అక్కడ ఎన్నికల నిర్వహణతో పాటు ప్రభుత్వ పథకాల అమలు కూడా చేపట్టడంతో వివాదాలు ముదిరాయి. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య నలుగుతున్న పోలవరం, మావోయిస్టులు, జంజావతి డ్యామ్ సమస్యలకు ఇది కూడా తోడైంది.

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జోక్యం
ఏపీ, ఒడిశా మధ్య కొనసాగుతున్న వివాదాలకు వైసీపీ సర్కార్ ఇప్పటివరకూ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. దీంతో ఈ వివాదాలు నానాటికీ ముదురుతున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ సర్కార్ తమ నవరత్నాల్ని కొటియా గ్రామాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. చివరికి అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ ప్రజా ప్రతినిధుల్ని సైతం ఒడిశా అడ్డుకోవడంతో ఇవి మరింత ముదిరాయి.
దీంతో ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జోక్యం చేసుకున్నారు. పలుమార్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ ను చర్చలకు ఆహ్వానించారు. ఒడిశా సీఎం నవీన్ తో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు దీంతో తాజాగా మరో అడుగు పడింది.

నవీన్ తో రేపు జగన్ భేటీ
ఏపీ-ఒడిశా మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాలు తాజాగా అడుగు ముందుకేశాయి. దీంతో రేపు ఏపీ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ కాబోతున్నారు. రేపు ఉదయం ఒడిశా రాజధాని భువనేశ్వర్ కు వెళ్లి సీఎం నవీన్ నివాసంలో జగన్ ఆయనతో భేటీ కానున్నారు. ఇందులో ఇరు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న పలు సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించి పరిష్కారాలు కనుగొనేందుకు తమవంతుగా ప్రయత్నాలు చేయబోతున్నారు. దీంతో ఈ భేటీని ఇరు రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాలు, జిల్లాల ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు.

జగన్-నవీన్ భేటీ అజెండా ఇదే
రేపు జరిగే జగన్, నవీన్ పట్నాయక్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. ఇందులో కీలకమైన కొటియా గ్రామాల సమస్యతో పాటు జంజావతి డ్యాం, నేరడి బ్యారేజీ అంశాలపై చర్చించబోతున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా అభ్యంతరాలపైనా చర్చించే అవకాశముంది. దీంతో ఇరువురు సీఎంల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
కొటియా గ్రామాల ప్రజలు ఏపీలో కలిసేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో జగన్-నవీన్ భేటీతో ఈ వివాదనికి ఓ పరిష్కారం దొరుకుతుందని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మిగతా అంశాలపైనా వీరిద్దరి చర్చలు సఫలీకృతం కావాలని అంతా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications