YS Jagan: ప్రతిపక్ష నేత హోదా ఇప్పించండి-హైకోర్టులో జగన్ పిటిషన్..!
ఏపీలో తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత 11 సీట్లకే పరిమితమైన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన విపక్షంగా గుర్తింపు కోసం పోరాటం చేస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారం శాసనసభలో 10 శాతం సీట్లు సాధిస్తేనే ప్రధాన విపక్ష హోదా ఇస్తామంటోంది. దీనిపై ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పీకర్ కు లేఖ రాసినా స్పందన లేకపోవడంతో ఇవాళ హైకోర్టును ఆశ్రయించారు.

తాజా ఎన్నికల ఫలితాల తర్వాత కూటమికి అసెంబ్లీలో 164 సీట్లు, వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. అయినా తనకు ప్రతిపక్షంలో మరో పార్టీ లేకపోవడంతో తనను విపక్ష నేతగా గుర్తించాలంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి గతంలో జగన్ లేఖ రాశారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రధాన విపక్ష నేత హోదా కావాలంటే 10 శాతం సీట్లు ఉండాలంటోంది. కానీ వైసీపీ మాత్రం రాజ్యాంగంలో అలాంటి నిబంధన లేదని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో జగన్ దాఖలు చేసిన పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో తనకు విపక్ష నేతగా గుర్తించేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తాను స్పీకర్ కు లేఖ రాసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. కాబట్టి తన పిటిషన్ పై విచారణ జరిపిన విపక్ష నేత హోదా ఇప్పించాలని జగన్ తన పిటిషన్ లో కోరారు. దీనిపై హైకోర్టు త్వరలో విచారణ చేపట్టబోతోంది. గతంలో ఇలా 10 శాతం సభ్యుల బలం లేకపోయినా చట్టసభల్లో విపక్ష నేత హోదా కల్పించిన ఉదాహరణల్ని జగన్ తన పిటిషన్ లో ప్రస్తావించారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఓడిపోయాడు, చచ్చిపోలేదంటూ తనను చంపేయాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారని జగన్ తన పిటిషన్ లో ఆరోపించారు. అలాంటి దురుద్దేశాలు ఉన్న వ్యక్తి స్పీకర్ కావడం, తనకు విపక్ష నేత హోదా నిరాకరించడాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తనకు విపక్ష నేత హోదా కోరుతూ లేఖ రాసిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని జగన్ హైకోర్టును కోరారు.
1953 నాటి ఏపీ జీతభత్యాలు, అనర్హతల తొలగింపు చట్టం ప్రకారం 10 శాతం సభ్యులుంటేనే విపక్ష నేత హోదా ఇవ్వాలని ఎక్కడా లేదన్నారు. 1996లో కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినా అసెంబ్లీలో పీజేఆర్ కు విపక్ష నేత హోదా ఇచ్చిన విషయం గుర్తుచేశారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీలోనూ బీజేపీకి కేవలం 3 సీట్లే వచ్చినా విపక్ష నేత హోదా ఇచ్చారన్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని తనకు విపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వాలని జగన్ కోరారు.












Click it and Unblock the Notifications