ఏపీలో సచివాలయ ఉద్యోగులకు జగన్ మరో గుడ్ న్యూస్..
ఏపీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే తన ప్రభుత్వంలో భాగంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్ధలో కీలకంగా ఉన్న ఉద్యోగులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్న సీఎం జగన్ ఇవాళ వారికి మరో శుభవార్త తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న చోటు నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీలపై వెళ్లేందుకు సైతం ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఫైలుపై సంతకం చేశారు.
గ్రామ సచివాలయం ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలిపినట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులకు జూన్ 10 వరకు బదిలీలకు అవకాశం కల్పించారు. దీంతో బదిలీలు కావాల్సిన ఉద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం వారికి విధివిధానాలు కూడా ప్రకటించింది.

రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. జిల్లా పరిధిలో బదిలీలతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం కల్పించారు. జిల్లాలో రిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించారు. అంతర్ జిల్లా బదిలీలలో స్పౌజు కేసు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించారు.
రాష్ట్రంలో సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీల్ని కూడా చేపట్టాలని ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సాధారణ ఉద్యోగుల బదిలీలతో పాటే వీరికి కూడా బదిలీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం ప్రకటించింది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications