బాబును నిలదీద్దాం: జగన్, పార్టీ ఫిరాయిస్తే..: మేకపాటి
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విమర్శించారు. విశాఖ జిల్లాల అనకాపల్లి లోకసభ నియోజకవర్గంపై జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇచ్చిన హామీలు నిలపెట్టుకోకుంటే చంద్రబాబుని నిలదీద్దామని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సమస్యల పైన పోరాడుతూ ప్రజలకు అండగా ఉందామని సూచించారు. మనం బలమైన ప్రతిపక్షంగా ఉన్నామని, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. గ్రామస్థాయి నుండి క్యాడర్ను బలోపేతం చేయడానికి అందరు కృషి చేయాలని కోరారు.

గుర్తింపు రద్దు చేయాలి: మేకపాటి
పార్టీలను ఫిరాయించే జంప్ జిలానీలను ప్రోత్సహించే పార్టీల గుర్తింపును రద్దు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి పార్టీల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యమవుతుందన్నారు. అంతేకాకుండా, కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20 ఏళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు.
పోలవరం ఆర్డినెన్స్ను తప్పుపట్టిన అసద్
లోకసభలో హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పోలవరం ఆర్డినెన్స్ను తేవడాన్ని తప్పు పట్టారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. మూడు రాష్ట్రాలతో వివాదం ఉన్నప్పుడు పోలవరం ముంపు గ్రామాలపై ఏకపక్షంగా ఆర్డినెన్స్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. వెంటనే ఆర్డినెన్స్ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. అసద్ వ్యాఖ్యలకు తెరాస సభ్యులు మద్దతు పలుకగా, ఆంద్ర ప్రదేశ్ టిడిపి సభ్యులు నిరసన తెలిపారు.












Click it and Unblock the Notifications