చంద్రబాబు ప్లాన్-ఆదిలోనే గుర్తించి బ్రేక్ వేసిన వైఎస్ జగన్-మధ్యలో పయ్యావుల బలి !
ఏపీలో ముందస్తు ఎన్నికల రాజకీయాలతో పార్టీలు, వాటి అధినేతలు అప్రమత్తమవుతన్నారు. ముందస్తు వ్యూహాలతో రాజకీయానికి పదునుపెడుతున్నారు. ఇదే క్రమంలో ప్రత్యర్ధులు వేస్తున్న వ్యూహాల్ని బ్రేక్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. తాజాగా చంద్రబాబు వేసిన ఓ ప్లాన్ ను జగన్ బ్రేక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో సైలెంట్ గా ఉండి కొంతకాలంగా యాక్టివ్ అవుతున్న ఓ టీడీపీ ఎమ్మెల్యే బలయ్యారు. ఆ కథంటో ఓసారి చూసేద్దాం..
ఏపీలో ముందస్తు కాక
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు రెండేళ్ల గడువు ఉన్నా ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అందులోనూ వ్యూహాలకు, ప్రతివ్యూహాలకు పేరొందిన ఇద్దరూ రాజకీయ హేమాహేమీలు ప్రత్యర్ధులుగా ఉండటంతో ఈ రాజకీయం పరాకాష్టకు చేరుతోంది. ముఖ్యంగా ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్ధితులు, ప్రత్యర్ధుల బలహీనతలు, మైండ్ గేమ్ లతో కాక రేగుతోంది. ఇందులో పలువురు పావులుగా కూడా మారిపోతున్నారు. దీంతో ఈ రాజకీయం ఫైనల్ గా ఏ మలుపు తీసుకుంటుందోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
తెరపైకి చంద్రబాబు పాత ప్లాన్
ఏపీలో ఒకప్పుడు రాజకీయ చతురుడిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబుకు రాష్ట్ర విభజన తర్వాత ఓటుకు నోటు కేసు రూపంలో పెను సవాల్ ఎదురైంది. చంద్రబాబు ఆడియోతో పాటు ఆయన పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేకు నోట్ల కట్టలు ఇస్తూ దొరికిపోవడంతో టీడీపీ అధినేత ఇరుకునపడ్డారు. దీంతో ఇక చంద్రబాబు పని అయిపోయినట్లేనని అంతా భావించారు. చివరి నిమిషంలో తనను ఈ కేసులో ఇరికించిన కేసీఆర్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్ని తెరపైకి తెచ్చారు. నువ్వు ఫోన్ ట్యాప్ చేయడం వల్లే మేం దొరికిపోయాం కాబట్టి నీదే తప్పన్నారు. అధికారికంగా ఈ నిఘాకు అనుమతి లేకపోవడంతో కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారు. చంద్రబాబు బయటపడ్డారు. ఇప్పుడు సరిగ్గా ఇదే వ్యూహాన్ని చంద్రబాబు మళ్లీ తెరపైకి తెస్తున్నారు.
ఆదిలోనే అడ్డుకున్న జగన్
వైసీపీ ప్రభుత్వంపై మూడేళ్లుగా పలు విధానాలుగా పోరాటాలు చేస్తున్నచంద్రబాబు తాజాగా మరోసారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల్ని తెరపైకి తెచ్చారు. తన పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సాయంతో జగన్ సర్కార్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయిస్తున్నారు. దీంతో వైసీపీ ప్రభుత్వం తమపై పెట్టిన నిఘాకు అవుతున్న ఖర్చుపై కాగ్ ఆడిట్ చేయించమంటూ పయ్యావుల సవాల్ విసిరారు. దీంతో అప్రమత్తమైన జగన్ సర్కార్ ఇవాళ ఆయనకు గన్ మెన్ల భద్రతను ఉపసంహరించింది. తద్వారా పయ్యావుల ముందరి కాళ్లకు బ్రేక్ వేసింది. అసలే రాయలసీమ, అందులోనూ వైసీపీకి అనుకూలంగా ఉన్న పరిస్దితులు. దీంతో పయ్యావుల ఆరోపణలకు బ్రేక్ వేయాలంటూ ముందుగా ఆయన్ను అభద్రతా భావంలోకి నెడితే సరిపోతుందని జగన్ భావించారు. దీంతో ఇప్పుడు పయ్యావుల ఫోన్ ట్యాపింగ్ కంటే ముందు ఆయన భద్రతపై పోరాటం చేసే పరిస్ధితి తెచ్చారు.
2024 ఎన్నికల ప్లాన్ ఇదే !
గతంలో 2014 ఎన్నికల తర్వాత, అలాగే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు, జగన్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు తెరపైకి తెచ్చారు. 2014 ఎన్నికల తర్వాత కేసీఆర్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబుపై ఇవే ఆరోపణలు తెరపైకి తెచ్చి జగన్ కూడా సక్సెస్ అయ్యారు. ఐటీ గ్రిడ్స్ సంస్ధ సాయంతో చంద్రబాబు తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని జగన్ చేసిన ఆరోపణలు కూడా జనం నమ్మారు. దీనికి మరో కారణం చంద్రబాబు ఐటీ హంగామా అనుభవాలే. దీంతో ఈసారి జగన్ సర్కార్ పై చంద్రబాబు చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు 2024 ఎన్నికల నాటికి తీవ్ర రూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి జనం ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.