కాస్త మా వైపు చూడండి, అసెంబ్లీలో ప్లే చేస్తా: బాబుకు జగన్ సవాల్
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు డ్వాక్రా రుణాలు, రుణమాఫీ పైన వాడిగావేడిగా చర్చ సాగింది. ఓ సమయంలో వైసిపి అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాల్ విసిరారు. రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారా లేదా అని సవాల్ చేశారు.
రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పలేదంటే తాను రాజీనామా చేస్తానని, అన్నారని నిరూపిస్తే ఆయన రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. చంద్రబాబు అన్న మాటలను తాను అసెంబ్లీలో ప్లే చేస్తానని తీవ్రంగా స్పందించారు. రుణమాఫీ విషయమై ఆయన ప్రతి సభలో చెప్పారన్నారు.
Also Read: ఎన్టీఆర్ పేరు చెప్పి నిప్పులు: రూల్స్ మార్చిన బాబు, జగన్ మరోసారి చిత్తు!
అంతకుముందు, మైనార్టీ సంక్షేమం, డ్వాక్రా రుణాలపై చర్చ జరిగింది. మంత్రి వీటిపై సమాధానం ఇచ్చారు.
దీనిపై జగన్ మాట్లాడుతూ... మంత్రి సమాధానం పైన తాము సంతృప్తి చెందలేదని, తమకు నిరనస తెలిపేందుకు అవకాశం ఇవ్వడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీ కేటాయింపులపై మంత్రి అబద్దాలు చెబితే ఎలా అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తోందన్నారు. వైసిపి సభ్యులు పోడియం ముందు కూర్చొని నిరసన తెలిపారు.
సభలో మా హక్కులను కాల రాస్తున్నారన్నారు. ప్రతిపక్షాలకు కూడా మాట్లాడేందుకు సమయం ఇవ్వాలన్నారు. మైనార్టీలకు కేటాయింపులపై మంత్రి అబద్దాలు చెబుతున్నారన్నారు.
మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ... తాను అబద్దాలు చెప్పినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమన్నారు. నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. అబద్దాలు చెప్పవలసిన అవసరం తనకు లేదన్నారు.
వైసిపి సభ్యులు మాట్లాడుతూ.. స్పీకర్ తమ వైపు చూడటం లేదన్నారు. వారు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. జగన్ మాట్లాడుతూ.. అధ్యక్షా.. దయచేసి మా వైపు చూడండి.. అని స్పీకర్ కోడెల శివప్రసాద రావుతో అన్నారు. మేం ప్రొటెస్ట్ అని చెప్పినప్పుడు మీరు మావైపు చూడరని, మరో ప్రశ్నలోకి వెళ్తారన్నారు.
దీనిపై స్పీకర్ మాట్లాడుతూ.. విపక్షాలకు మాట్లాడేందుకు తాను సమయం ఇచ్చినట్లు ఎవరూ ఇవ్వలేదన్నారు. సభా సంప్రదాయాలు అందరూ పాటించాలన్నారు. రూల్స్ ప్రకారం ప్రతిపక్షానికి వాకౌట్ చేసే హక్కు ఉందన్నారు.
దీనిపై మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. స్పీకర్ ఎప్పుడూ ప్రతిపక్షం వైపే చూడవచ్చునని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షానికి సమయం ఇస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పారు.