నేను ఫస్ట్ క్లాస్ విద్యార్థిని, మీ గురించి కేటీఆరే చెప్పారు: బాబుపై జగన్
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసును మాల్ ప్రాక్టీసు కేసుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైయస్ జగన్ ఆరోపించారు. శాసన సభలో జగన్ ఈ అంశంపై మాట్లాడారు.
అమరావతి: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసును మాల్ ప్రాక్టీసు కేసుగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైయస్ జగన్ ఆరోపించారు. శాసన సభలో జగన్ ఈ అంశంపై మాట్లాడారు.
మంత్రి నారాయణను కాపాడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన విద్యార్హతపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడారు.
తాను పదో తరగతి వరకు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివానని, టెన్త్, ఇంటర్, డిగ్రీలో తాను ఫస్ట్ క్లాస్ విద్యార్థినని చెప్పారు. చంద్రబాబులాగ ఎంఫిల్ చేయకుండానే చేసినట్లు తాను చెప్పుకోవడం లేదన్నారు.

చంద్రబాబు అంత దారుణంగా ఇంగ్లీష్ ఎవరూ మాట్లాడరని, తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని ఓ సందర్భంలో చెప్పారని జగన్ ఎద్దేవా చేశారు. ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి ఒక్క చంద్రబాబేనని కేటీఆర్ అన్నారని తెలిపారు.
అంతకుముందు, చంద్రబాబు మాట్లాడారు. తమ ప్రభుత్వమే మొదటిసారి పదవ తరగతి పరీక్షల్లో జంబ్లింగ్ పద్ధతి తీసుకొచ్చిందని, ఆ పద్ధతిపై ప్రతిపక్ష పార్టీ సభ్యులకు కనీస అవగాహన కూడా లేదన్నారు.
జగన్ ఎప్పుడూ పరీక్షలు రాయలేదేమోనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అందుకే పరీక్షల విధానం గురించి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. అసలు జంబ్లింగ్ అంటే ఏంటో మీకు తెలుసా? అని ఆయన వైసీపీ సభ్యులను ప్రశ్నించారు.
సమస్యలను పరిష్కరించే దిశగా చర్చలు ఉండాలి కానీ, ఇలా అసత్య ఆరోపణలు చేయడానికి కాదన్నారు. జంబ్లింగ్ అంటే ఒక్క స్కూల్లో ఉండే పిల్లల్ని కంప్యూటర్ ద్వారా విభజించి నాలుగైదు స్కూళ్లకు పరీక్షలకు పంపిస్తారన్నారు.
ఈ ఏడాది ఇన్విజిలేటర్లకు కూడా జంబ్లింగ్ విధానం తీసుకొచ్చామన్నారు. ఇంటర్లో ప్రాక్టికల్ టెస్టులకు కూడా జంబ్లింగ్ తీసుకొచ్చామని తెలిపారు. పదో తరగతి పేపర్ లీక్ కాలేదన్నారు.












Click it and Unblock the Notifications