ప్రతి ఇంటికి రూ.76వేలు చంద్రబాబు బకాయి, కళ్ళు నెత్తికెక్కాయి: జగన్
నంద్యాల ఉప ఎన్నికలు వచ్చినందునే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రతి సామాజిక వర్గానికి వరాలు కురిపిస్తున్నారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ విమర్శించారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలు వచ్చినందునే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రతి సామాజిక వర్గానికి వరాలు కురిపిస్తున్నారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ విమర్శించారు.
నంద్యాల ఉప ఎన్నికను పురస్కరించుకొని సోమవారం నాడు నంద్యాలలో వైఎస్ జగన్ విస్తృతంగా పర్యటించారు. వరుసగా 6వ, రోజు నంద్యాలలో జగన్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నెల 9వ, తేది నుండి జగన్ నంద్యాలలోనే మకాం వేశారు.
నంద్యాలలో ఈ నెల 23వ, తేదిన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను అధికార టిడిపి, విపక్ష వైసీపీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
నంద్యాలలో ఓటర్లను ఆకట్టుకొనేందుకుగాను టిడిపి, వైసీపీలు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. పోటాపోటీగా రెండు పార్టీల నేతలు నంద్యాలలో మకాం వేసి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారంనాడు నంద్యాల ఏటీఏం సెంటర్లో నిర్వహించిన రోడ్షోలో జగన్ ప్రసంగించారు.
బాబుకు కళ్ళు నెత్తికెక్కాయి
మూడేళ్ళలో పాలన పేరుతో అవినీతి చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు అహంకారం బాగా పెరిగిందన్నారు. బాబుకు కళ్ళు నెత్తికెక్కాయన్నారు వైసీపీ చీఫ్ జగన్.ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరికి ఎర వేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.ఒకవేళ ఎరకు దొరకకపోతే బుజ్జగింపులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
Recommended Video
బాబు ప్రతి ఇంటికి రూ. 76 వేల బకాయి
హమీల పేరుతో రైతులను, మహిళలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మోసం చేశారని జగన్ ఆరోపించారు. ప్రతి ఇంటికి రూ.76 వేలు బాకీ పడ్డారని ఆయన ఆరోపించారు. మూడున్నర ఏళ్ళలో కనీసం ఒక్క ఇల్లు కూడ కట్టించలేదన్నారు. ఇళ్ళ స్థలాలను మంజూరు చేస్తామని ఇచ్చిన హమీని నెరవేర్చలేదని చెప్పారు.
కేబినెట్ అంతా నంద్యాలలోనే
ఉపఎన్నికను పురస్కరించుకొని కేబినెట్ మొత్తం నంద్యాలలోనే మకాం వేసిందని వైసీపీ జగన్ ఆరోపించారు.నంద్యాలలో ఉప ఎన్నికలు లేకపోతే మంత్రులంతా నంద్యాలలో కన్పించేవారా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా సమస్యలను పరిష్కరిస్తామంటూ ముందుకు రావడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.
అభివృద్ది అంటే ఇదేనా?
రోడ్ల విస్తరణ పేరుతో రాత్రికి రాత్రే ఇళ్ళను కూల్చేసి మార్కెట్ రేటు కంటే దారుణమైన పరిహరాన్ని చెల్లించడం సరైందేనా అని జగన్ ప్రశ్నించారు. ఇదేనా అభివృద్ది అంటూ ఆయన ప్రశ్నించారు. ఎయిర్పోర్ట్, ఉర్దూ యూనివర్శిటీ , స్మార్ట్సిటీ , ట్రిపుల్ ఐటీ, రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ, ఫుడ్ ఫ్యాక్టరీ కర్నూల్ జిల్లాకు ఇచ్చిన ఒక్క హమీని కూడ టిడిపి ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు జగన్