వైఎస్ జగన్.. ప్రజాసంకల్పయాత్ర 1000 కిలోమీటర్లు!
Recommended Video
నెల్లూరు : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
మూడువేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని ఆయన సోమవారం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం వద్ద అధిగమించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, గ్రామస్థులు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు.
పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్ సైదాపురంలో పైలాన్ను ఆవిష్కరించారు. ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రజా సమస్యలను సావధానంగా వింటూ.. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలను ఎండగడుతూ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
వైసీపీ అధికారంలోకి రాగానే రాజన్న తనయుడిగా ప్రజామోద పాలన అందిస్తామని భరోసానిస్తూ ఆయన ముందుకెళ్తున్నారు. ప్రజలు కూడా స్ఫూర్తిదాయక హామీలతో కొనసాగుతున్న జగన్ ప్రజాసంకల్పయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు.
గత ఏడాది నవంబర్ 6న ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ నుంచి వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో జననేతకు బాసటగా 'వాక్ విత్ జగన్' అంటూ వేలాదిమంది పాదయాత్రలతో ఉరకలెత్తారు.