అప్పులపై జగన్ తేల్చేసారు: చంద్రబాబుతో పోల్చుతూ: ఈ పథకంతో ఇక..!!
అమరావతి: రాష్ట్రంలో తోపుడుబండ్లు, చిరు వ్యాపారుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం అమలు చేస్తోన్న జగనన్న తోడు పథకం కింద నిధులు విడుదల అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిధులను విడుదల చేశారు. నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేశారు. ఈ నిధుల విలువ 395 కోట్ల రూపాయలు. 3.95 లక్షలమంది చిరు వ్యాపారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారు
వైఎస్ జగన్ను ఎండగట్టిన ఉండవల్లి: నా ప్రాణం ఉన్నంత వరకూ
అందుకే ఆ పథకం..
ఈ సందర్భంగా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ జగన్ మాట్లాడారు. పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రం తీసుకుంటోన్న రుణాలపైనా ఆయన స్పందించారు. చిరు వ్యాపారులను సమాజ సేవకులుగా అభివర్ణించారు. నడ్డి విరిచే అధిక వడ్డీల బారి నుంచి వారికి విముక్తి కల్పించడానికే జగనన్న తోడు పథకానికి రూపకల్పన చేశామని వివరించారు. ఇప్పటి వరకు 15,03,558 మంది చిరువ్యాపారులకు, సంప్రదాయ చేతివృత్తుల కళాకారుల కోసం 2,011 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలను అందించినట్లు చెప్పారు.
స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ..
గతంలో ఏ ప్రభుత్వం కూడా చిరువ్యాపారుల గురించి ఆలోచన చేయలేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ ఇంకొకరి మీద ఆధారపడకుండా, వారి కాళ్ల మీద నిలబడే గొప్ప కార్యక్రమానికి చేయూతనిస్తున్నామని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 34 లక్షల మందికి బ్యాంకుల ద్వారా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకమైన తోడ్పాటును అందించగా.. ఒక్క ఏపీలోనే 15.03 లక్షల మందికి ఈ నిధులను అందించామని అన్నారు.
నేరుగా ఖాతాల్లో..
దీనికి అయ్యే వడ్డీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వడమే కాకుండా.. బ్యాంకులకు సకాలంలో చెల్లించిన వారికి కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా చేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. ఈ రుణం తీరిన తరువాత లబ్ధిదారులు మళ్లీ వడ్డీ లేని రుణం పొందడానికి అర్హులవుతారని చెప్పారు. ఇప్పటివరకు సకాలంలో రుణాలు చెల్లించిన 12.50 లక్షల మంది లబ్ధిదారుల వడ్డీ భారాన్ని తామే మోస్తున్నామని, దీని కింద రూ.48.48 కోట్లను విడుదల చేశామని అన్నారు.
చేతి వృత్తి కళాకారులకూ..
సంప్రదాయ చేతి వృత్తి కళాకారులైన బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కళంకారి, తోలుబొమ్మలు, ఇతర సామగ్రి తయారీదారులు, లేస్ వర్క్, కుమ్మరి, కమ్మరి తదితరాల మీద ఆధారపడి జీవిస్తున్న హస్తకళాకారులు, సంప్రదాయ చేతివృత్తుల వారికి ఇలా అందరికీ వడ్డీ లేని రుణాన్ని ఇస్తోన్నామని, ఇలాంటి ఆలోచన గత ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
3-4 పథకాలు..
జగనన్న తోడు ద్వారా ఇప్పటి వరకు లబ్ధిపొందిన 15.03 లక్షల మందికి.. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, పెన్షన్ కానుక, ఇళ్ల పట్టాలు, ఇళ్లు.. ఇలా అనేక పథకాల్లో కనీసం మూడు నుంచి నాలుగు అందుతున్నాయని చెప్పారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేదని గుర్తు చేశారు. నేరుగా బటన్ నొక్కి, లబ్దిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తోన్నామని అన్నారు.
అప్పుడు అప్పులు లేవా?
గతంలోనూ ఒక ప్రభుత్వం, బడ్జెట్ ఉండేదని, ఇప్పుడూ ప్రభుత్వం.. అదే బడ్జెట్ ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి మాత్రమే మారాడని అన్నారు. గతంలో చేసిన అప్పులతో పోల్చితే.. సీఏజీఆర్ ఇప్పుడు చాలా తక్కువే ఉందని అన్నారు. ఇదివరకు 19 శాతం అప్పులు ఉంటే.. ఇప్పుడు 15 శాతం మాత్రమేనని అన్నారు. అప్పుడు కూడా అప్పులు చేసిన ప్రభుత్వం ఇలాంటి పథకాల గురించి ఎందుకు ఆలోచన చేయలేకపోయిందని ప్రశ్నించారు.