కోటంరెడ్డి వ్యవహారంపై ఏం చేద్దాం ? సజ్జల, వైవీతో జగన్ చర్చలు- రెబెల్ ఎమ్మెల్యే వ్యూహమిదే ?
ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతున్న సీఎం జగన్.. దీనిపై వైసీపీ కీలక నేతలు సజ్జల, వైవీతో చర్చిస్తున్నారు.
ఏపీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీపైనే ఫోన్ ట్యాపింగ్ పేరుతో విమర్శలు ఎక్కుపెడుతున్న కోటంరెడ్డిపై ఏ నిర్ణయం తీసుకోవాలన్న దానిపై సీఎం జగన్ ఇవాళ కూడా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కోటంరెడ్డిపై మంత్రుల ఎదురుదాడి కొనసాగుతోంది. అటు టీడీపీలోకి వెళ్లే విషయంలో కోటంరెడ్డి కూడా ఆచితూచి అడుగులేస్తున్నారు.
కోటంరెడ్డి రచ్చపై జగన్ ఫోకస్
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ పేరుతో వైసీపీని టార్గెట్ చేయడం మొదలుపెట్టగానే ఆయనపై మంత్రులు, వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నట్లు బహిరంగంగానే చెప్పేయడంతో ఆ దాడిని మరింత ముమ్మరం చేశారు. అదే సమయంలో స్ధానిక వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఆదాల ప్రభాకర్ రెడ్డిని జగన్ నియమించారు. అలాగే కోటంరెడ్డి విషయంలో ఏం చేద్దామనే దానిపై జగన్ దృష్టిసారించారు.
సజ్జల, వైవీతో జగన్ చర్చలు
కోటంరెడ్డి వ్యవహారంపై ఇప్పటికే పార్టీ నేతలు, మంత్రులు, అధికారులతో వరుసగా చర్చలు జరుపుతున్న సీఎం జగన్ ఇవాళ కూడా వాటిని కొనసాగిస్తున్నారు. ఇవాళ వైసీపీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని పిలిపించుకుని ఇదే విషయంపై జగన్ చర్చలు జరుపుతున్నారు. కోటంరెడ్డి విషయంలో ఏం చేద్దామంటూ వారిని జగన్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే వెంటనే తీవ్ర చర్యలు తీసుకునేందుకు అవకాశాల్లేకపోవడంతో ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారు. సెక్యూరిటీ తొలగింపు వంటి చర్యలకు దిగితే కోటంరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారన్న దానిపైనా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి బహిష్కరణ వేటు వేస్తే నేరుగా టీడీపీలో చేరిపోయే అవకాశం ఉండటంతో వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది.
ఆలోపు మంత్రుల అటాక్ కొనసాగింపు
ఓవైపు కోటంరెడ్డి విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై మంత్రులు, కీలక నేతలతో చర్చలు జరుపుతున్న సీఎం జగన్.. ఆ లోపు మంత్రులతో కౌంటర్ అటాక్ కు తెరదీశారు. మంత్రుల్ని కోటంరెడ్డి వ్యవహారంలో కౌంటర్లు ఇవ్వాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే మంత్రులు ప్రతీ ఒక్కరూ కోటంరెడ్డి వ్యవహారంపై స్పందిస్తున్నారు. కోటంరెడ్డిని చంద్రబాబుకు, టీడీపీకి లింక్ చేస్తూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇవాళ మంత్రులు కాకాణి, మేరుగ నాగార్జున కోటంరెడ్డిపై ఎదురుదాడి కొనసాగించారు.
కోటంరెడ్డి వ్యూహమిదే ?
మరోవైపు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న అనూహ్య ఎదురుదాడితో ఓవైపు ఉక్కిరిబిక్కిరవుతూనే.. మరోవైపు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ తీసుకోబోయే చర్యలపై ఆయన ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే వైసీపీని రెచ్చగొట్టి చర్యలు తీసుకునేలా పురికొల్పాలన్నది కోటంరెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ వైసీపీ కీలక నేత సజ్జల సోషల్ మీడియాలో మాట్లాడారంటూ ఓ ఆడియోను బయటపెట్టారు. ఫైనల్ గా వైసీపీ అధికారికంగా తనను పార్టీ నుంచి బహిష్కరిస్తే టీడీపీలో చేరిపోవాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో వైసీపీ కూడా ఆ దిశగా దూకుడు నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా లేదు.