సజ్జల, హోం సెక్రటరీతో జగన్ చర్చలు-ఫోన్ ట్యాపింగ్ పై ప్రకటన ? ఇన్ ఛార్జ్ రేసులోకి అనిల్ ?
ఏపీలో వైసీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ నేత సజ్జలతో పాటు హోంసెక్రటరీని పిలిపించి సీఎం జగన్ మాట్లాడారు.
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన ట్యాపింగ్ ఆరోపణలు ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇవాళ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు హోంశాఖ కార్యదర్శిని పిలిపించి మాట్లాడారు. ట్యాపింగ్ పై ఎలా స్పందించాలన్న దానిపై కీలక ఆదేశాలు ఇచ్చారు. అలాగే నెల్లూరు రూరల్ స్దానంలో వైసీపీ ఇన్ ఛార్జ్ నియామకంపై చర్చిస్తున్నారు.
సజ్జలతో జగన్ చర్చలు
ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై చర్చించేందుకు ఇవాళ సీఎం జగన్ వద్దకు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్లారు. ఆయనతో పాటు హోంశాఖ కార్యదర్శి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిద్దరితో జగన్ ట్యాపింగ్ వ్యవహారం ఇంత రచ్చ కావడానికి గల కారణాలపై చర్చించారు. ఫోన్ ట్యాపింగ్ పై కోటంరెడ్డి చేస్తున్న ఆరోపణలు విపక్షాలకు అస్త్రంగా మారుతున్న నేపథ్యంపై చర్చించారు. అలాగే కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసేందుకు కోటంరెడ్డి సిద్ధం అవుతున్న నేపథ్యంలో ట్యాపింగ్ ఆరోపణల్ని దీటుగా తిప్పికొట్టాలని వారికి జగన్ సూచించినట్లు తెలుస్తోంది.
హోంశాఖ ప్రకటన చేసే ఛాన్స్
రాష్ట్రంలో ఇద్దరు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో ప్రభుత్వం ఇరుకునపడింది. ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం లేదని, రికార్డింగ్ ను ట్యాపింగ్ అనుకుంటున్నారంటూ కోటంరెడ్డిపై మంత్రి అమర్నాథ్ చేసిన కామెంట్లతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. అలాగే ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులు కోటంరెడ్డికి పంపిన ఆడియో కూడా కలకలం రేపుతున్న నేపథ్యంలో దీనిపై వివరణ ఇచ్చేందుకు హోంశాఖ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఓ ప్రకటన చేయాలని జగన్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ జరగలేదంటూ హోంశాఖ ప్రకటన చేసే అవకాశముంది.
నెల్లూరు రూరల్ ఇన్ ఛార్జ్ గా అనిల్ ?
అదే సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ధానంలో వైసీపీ ఇన్ ఛార్జ్ గా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ పదవి కోసం ఎంపీగా ఉన్న ఆదాలను సంప్రదించినా ప్రస్తుత పరిస్ధితుల్లో దీన్ని తీసుకునేందుకు ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో మాజీ మంత్రి అనిల్ ను క్యాంపు ఆఫీసుకు రావాలని ఫోన్ కాల్ వెళ్లింది. ఇవాళ సీఎం జగన్ తో సమావేశమైన తర్వాత అనిల్ పేరును ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే నెల్లూరు సిటీ, రూరల్ స్ధానాలు రెండింటికీ అనిల్ బాధ్యుడిగా మారతారు. ఆయన కాదంటే మాత్రం మరొకరి కోసం జగన్ వెతుక్కోక తప్పేలా లేదు.