బంధువులతో జగన్కు పెరుగుతున్న దూరం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తన తల్లి విజయమ్మ తరఫు బంధువులతో దూరం పెరుగుతున్నట్లు కనపడుతోందనే విశ్లేషణలు వస్తున్నాయి. కొంతకాలంగా జగన్ కు తన సోదరి షర్మిల, తల్ల విజయమ్మతో విభేదాలున్నాయంటూ మీడియాలోవార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండల వైసీపీ అధ్యక్షుడు వైఎస్ కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టరును బెదిరించాలనే ఆరోపణపై అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పనులు చేస్తున్న ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ కంపెనీ కర్ణాటక బీజేపీకి చెందిన నేతది.
పులివెందుల నియోజకవర్గం మొత్తం వైఎస్ కుటుంబ సభ్యుల చేతిలో ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా వారికి తెలియాల్సిందే. అటువంటిది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బంధువైన కొండారెడ్డిని అరెస్ట్ చేశారంటే పోలీసులకు పై స్థాయిలో అనుమతి లభించివుంటుందని భావిస్తున్నారు. పులివెందుల-రాయచోటి రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టరును చక్రాయపేటలో పనులు జరగాలంటే కప్పం కట్టాలంటూ కొండారెడ్డి బెదిరించారంటూ సదరు కాంట్రాక్టరు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన జగన్ చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల హైదరాబాద్లో ఉండటానికి కారణం జగన్ తో విభేదాలేనని తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తల్లి , సోదరితో దూరం పెరుగుతున్న సమయంలో బంధువైన కొండారెడ్డిని అరెస్ట్ చేయించడం పులివెందుల నియోజకవర్గంలో సంచలనంగా మారింది. స్టేషన్ బెయిల్ ఇస్తారా? లేదంటే తీవ్రంగా పరిగణించి మరిన్ని కేసులు కొండారెడ్డిపై నమోదు చేస్తారా? అనేది తెలియరాలేదు. కాంట్రాక్టరు ఫిర్యాదు చేసినదాన్ని బట్టి కేసుల తీవ్రత ఉండొచ్చని భావిస్తున్నారు.