95 శాతం హామీలు పూర్తి చేశా- దేవుడిచ్చిన అవకాశం- విజయనగరంలో జగన్ భావోద్వేగం
ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన నాటి నుంచీ సంక్షేమ పథకాల జాతర నిర్వహిస్తున్న వైసీపీ సర్కారు తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీ రూపంలో మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. ప్రస్తుతం ఈ పథకాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇవాళ విజయనగరం జిల్లాలో ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ దీనిపై భావోద్వేగంతో మాట్లాడారు. ఏడాదిన్నరగా తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఏకరువుపెట్టారు. ఇప్పటివరకూ తాము ఇచ్చిన ఎన్నికల హామీల్లో 95 శాతం పూర్తయినట్లు జగన్ పేర్కొన్నారు.
విజయనగరంలో జగన్ ఇళ్ల స్ధలాల పంపిణీ
ఇళ్ల పట్టాల పంపిణీతో రాష్ట్రంలో సంక్రాంతి ముందే వచ్చిందని జగన్ వ్యాఖ్యానించారు. 30.75 లక్షల ఇళ్ల స్ధలాలు పంపిణీ చేస్తున్నామని, 28 లక్షల ఇళ్లు కట్టిస్తున్నామని సీఎం తెలిపారు. విజయనగరం జిల్లాలోని గుంకలం లే అవుట్లో ప్రస్తుతం భూమి విలువ 3 లక్షలు ఉందని, ఇల్లు పూర్తి చేసి ఇస్తే పేదకు 8 లక్షల ఆస్తి ఇచ్చినట్లవుతుందని జగన్ పేర్కొన్నారు. లే అవుట్ సైజును బట్టి ఇక్కడే విద్యుత్ సబ్ స్టేషన్, బ్యాంకులు, ఆస్పత్రులు, పోలీసు స్టేషన్లు, క్లినిక్లు, రైతు బజార్లు, పోస్టాఫీసులు, బల్క్ మిల్క్ స్టోరేజ్లు, పార్కులు, స్మశానాలు, ఇలా అన్నీ ఇక్కడికే వస్తాయన్నారు. ఇక్కడే ఓ నగర పంచాయతీ ఏర్పడుతుందన్నారు
జగన్ ఎమోషనల్ కామెంట్స్
విజయనగరం జిల్లా గుంకలాంలో ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ భావోద్వేగానికి గురయ్యారు. ఇళ్ల స్దలాల పంపిణీపై మాట్లాడుతూ ఇంత మందికి మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. 2020 ఇప్పటివరకూ తీపి జ్ఞాపకాలు ఇచ్చిందని నెమరు వేసుకునే అవకాశం వచ్చిందని జగన్ తెలిపారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే జగన్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోవడానికి చాలా చేశానని చెబుతున్నానన్నారు. పేదలు, రైతులు, అవ్వతాతలు, వందల సామాజిక వర్గాలకు ఉపయోగపడ్డానని గర్వంగా చెప్పుకుంటున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఏడాదిన్నరలో చేసింది ఇదే..
ఈ ఏడాదిన్నర కాలంలో 87 లక్షల అక్కా చెల్లెళ్లకి ఆసరా ద్వారా, 62 లక్షల మందికి పైగా ఇతరులకూ ప్రతీ నెలా ఇంటికొచ్చి పింఛన్లు ఇవ్వగలిగేలా చేశామని సీఎం జగన్ తెలిపారు. 18.5 లక్షల మందికి విద్యా దీవెన ఇస్తున్నామని, సున్నా వడ్డీ ఫథకం, రైతులకు ఇన్సూరెన్స్ సాయం అదే సీజన్లో ఇవ్వడం గర్వంగా ఉందని జగన్ పేర్కొన్నారు. కోటీ 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ, లక్షా 30 వేల మందికి సచివాలయ ఉద్యోగాలు కల్పించామన్నారు. నాడు-నేడుతో రూపుమారిన స్కూళ్లు, ఆస్పత్రులు వస్తున్నాయన్నారు. 18 నెలల్లో 95 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చామన్నారు.