ఉద్యోగులకు మొహం చాటేస్తున్న జగన్-పీఆర్సీపై లీకులతోనే సరి-కిమ్మనని సంఘాలు
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది. ఎన్నిసార్లు ఎన్నిమాటలు మాట్లాడుకున్నా, లీకులు ఇస్తున్నా పీఆర్సీ ఫిట్ మెంట్ శాతంపై ప్రభుత్వం గతంలో అధికారుల కమిటీ ప్రకటించిన 14 శాతానికి మించి ఎంత ఇవ్వాలనే దానిపై తుది నిర్ణయానికి రాలేకపోతోంది. దీంతో సీఎం జగన్ ఉద్యోగ సంఘాలతో భేటీకి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ రేపు, మాపు అంటూ లీకులిస్తున్న ప్రభుత్వం... ఇప్పటికీ దానిపై నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ప్రభుత్వ హామీని నమ్మి ఉద్యమ విరమణ చేసిన సంఘాల నేతలపై ఒత్తిడి పెరుగుతోంది.
పీఆర్సీ
ఏపీ ఉద్యోగుల పీఆర్సీ ఏపీలో ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించి చాలా ఏళ్లవుతోంది. 2018 నుంచి పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. ఈ ఏడాది పీఆర్సీ ప్రకటిస్తే మరో ఏడాది విరామం తర్వాత 2023లో మరో పీఆర్సీ గడువు కూడా ముంచుకొస్తోంది. అయినా ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న పీఆర్సీపై ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇప్పటికే సీఎస్ కమిటీ 14.29 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదన ఉద్యోగులకు మంట పుట్టించింది. దీనిపై అధికారులతో ఉద్యోగ సంఘాలు పలుమార్లు చర్చించి తమ అసంతృప్తి వెళ్లగక్కాయి. అయినా ప్రభుత్వం ఉద్యోగులు కోరుతున్న విధంగా కనీసం 45 శాతం ఫిట్ మెంట్ దిశగా కూడా ఆలోచించే పరిస్ధితి లేదు. దీంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
పీఆర్సీపై సర్కార్ లీకులు
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ విషయంలో తుది నిర్ణయం తీసుకోవడంలో విపలమవుతున్న ప్రభుత్వం.. ఉద్యోగ సంఘాల ఆగ్రహం గమనించి లీకులు ఇస్తోంది. గతంలో ప్రకటించిన 27 శాతం ఐఆర్ కు తగ్గకుండా పీఆర్సీ ఇస్తామని లీకులు ఇస్తోంది. తద్వారా సీఎస్ కమిటీ ఇచ్చిన 14 శాతానికి దాదాపు రెట్టింపు ఫిట్ మెట్ ఇవ్వబోతున్నట్లు ప్రతిపాదిస్తోంది. దీంతో ఉద్యోగ సంఘాల ఆగ్రహం కాస్తయినా తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే అంశాన్ని రాతపూర్వకంగా హామీ ఇస్తామని చెప్పి ఉద్యోగులతో ఉద్యమాన్ని సైతం విరమింపజేసింది. దీనిపైనా ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఉద్యమాన్ని గాలికొదిలేసిన సంఘాలు
పీఆర్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. సీఎస్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం పేర్కొన్న 14.29 శాతం ఫిట్ మెంట్ ఆమోదయోగ్యం కూడా కాదు. అయినా ప్రభుత్వం మాట నమ్మి ఉద్యోగసంఘాలు ఉద్యమ విరమణ ప్రకటించేశాయి. దీంతో ఉద్యోగుల్లో దీనిపై కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ ప్రయోజనాలను పరిరక్షిస్తారని పగ్గాలు అప్పజెపితే నేతలు ఇలా తమను మోసం చేస్తారని అనుకోలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీఎంతో భేటీ కాకుండానే పీఆర్సీపై పోరును ఎలా విరమిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
మొహం చాటేస్తున్న జగన్
ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటన, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా దాదాపు 71 సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ తన పాదయాత్రలో హామీ ఇచ్చారు. కానీ ఇందులో ఏ ఒక్క హామీని ఇప్పటికీ నెరవేర్చలేదు. అయినా ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్న పెద్దలంతా జగన్ ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా ఉన్నారని చెప్తూ కాలం గడిపేస్తున్నారు. సీఎం జగన్ తో ఉద్యోగుల భేటీ త్వరలో అంటూ లీకులు ఇస్తుూనే ఉన్నారు. కానీ సీఎం జగన్ ఉద్యోగులతో భేటీ ఇప్పటికీ జరగలేదు. పీఆర్సీపై ఉద్యోగులు కోరుతున్న విధంగా కాకపోయినా తాము ఇవ్వగలిగినంత ఇవ్వక తప్పదు. అయినా ఆ విషయాన్ని సైతం ఉద్యోగులకు చెప్పేందుకు జగన్ కానీ, సలహాదారు సజ్జల కానీ ధైర్యం చేయలేకపోతున్నారు.