ఆడియో, వీడియో టేపుల్లో దొరికినా.. మన ఖర్మ: చంద్రబాబుపై జగన్ సెటైర్లు
వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర మండిపడ్డారు.
హైదరాబాద్: వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర మండిపడ్డారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి నీళ్లు రాకుండా మోటార్లు పెడుతుంటే చంద్రబాబు నోరు మెదపడం లేదని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్ని స్కాములే జరుగుతున్నాయని, వాటిపై విచారణ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడమే చంద్రబాబుకు సరిపోతోందని జగన్ ఎద్దేవా చేశారు.
విశాఖకు నేనొస్తా, హోదా కోసం అంతా రాజీనామా చేస్తాం: జగన్ సంచలనం
ఇసుక నుంచి రాజధాని వరకు అన్ని స్కాములేనని ఆరోపించారు. సూట్ కేసుల్లో నల్లధనం ఇస్తూ ఆడియో వీడియో టేప్ లతో దొరికిపోయారుపదవికి రాజీనామా చేయకుండా ఉన్న పరిస్థితి మన రాష్ట్రానికి జరుగుతోంది
సూట్ కేసుల్లో నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయినా.. ఆయనే ప్రభుత్వాధినేతగా ఉండటం మన రాష్ట్రంలోనే జరుగుతోందని ఓటుకు నోటు కేసును జగన్ ప్రస్తావించారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినా కూడా తన పదవికి రాజీనామా చేయకపోవడం ఆయనకే చెల్లుతుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే కడతామంటే.. తమ కంట్రాక్టర్ల కోసం చంద్రబాబే ఆ ప్రాజెక్టును తీసుకుని ఎస్టిమేషన్ రేటు పెంచారని ఆరోపించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా? అని ప్రశ్నించారు. హోదా కోసం చేస్తున్న కొవ్వొత్తుల ర్యాలీని అడ్డుకోవడం ఏంటని ఆయన నిలదీశారు. ఏపీలో పోలీసు రాజ్యం బ్రిటీషు పాలనను తలపిస్తోందని అన్నారు. స్వాతంత్ర్యం రాకముందు చంద్రబాబునాయుడు లీడర్గా లేకపోవడం మనకు సంతోషకరమైన విషయమని అన్నారు.
అప్పుడు గానీ, ఉండుంటే.. స్వాతంత్ర్యం మనకెందుకు? వారితో సఖ్యతగా ఉండాలని అనేవారు.. అంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. అప్పుడు చంద్రబాబు లేకపోవడం మన అదృష్టమన్న జగన్.. ఇప్పుడు సీఎంగా ఆయన ఉండటం మన ఖర్మంటూ ఎద్దేవా చేశారు. యువభేరీలో పాల్గొన్న యువకులపై పీడీ కేసులు పెడతామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబునే బొక్కలో వేయాలని అన్నారు.
చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని అన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఎన్ని విదేశీ పర్యటనలు చేసినా.. చంద్రబాబు ముఖం చూసి ఎవరూ ముందుకు రారని, ప్రత్యేక హోదా వస్తేనే పెట్టుబడులు వస్తాయని అన్నారు. హోదా కోసం శాంతియుతంగా జరిగే ర్యాలీలను, కొవ్వొత్తుల ప్రదర్శనను అడ్డుకోవద్దని జగన్మోహన్ రెడ్డి అన్నారు.