దమ్ముంటే ఎన్నికలకు రండి: బాబుకు జగన్ సవాల్, ‘ఏడాదికి మళ్లీ వస్తారు’
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు.
కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తాను చంద్రబాబు లాగా వెన్నుపోటుపొడిచి రాజకీయాల్లోకి రాలేదని వ్యాఖ్యానించారు. దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని ఆయన చంద్రబాబుకు సవాలు విసిరారు.
ఎమ్మెల్యేలను కొనడం వల్ల ప్రభుత్వాలు నిలబడవని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదిస్తేనే ప్రభుత్వాలు నిలబడతాయని జగన్ అన్నారు. 'నలుగురైదుగురు ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్ల ఏమీ కాదు. మొట్టమొదట పార్టీలో అమ్మ, నేను మాత్రమే ఉన్నాం. ఆ తర్వాత 18 మంది ఎమ్మెల్యేలు వస్తే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాం. అనంతరం మా బలం 67 కు చేరుకుంది' అని తెలిపారు.
అధికార పార్టీ పట్టిసీమ, జెన్ కో, రాజధాని భూముల్లోని అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కోనుగోలు చేస్తోందని, ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 నుంచి 30 కోట్లు ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేక చంద్రబాబు ప్రతిపక్షం గొంతు నొక్కే పనిలో పడ్డారని మండిపడ్డారు.
టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల నియెజక వర్గాల్లో అంతకంటే మెరుగైన నాయకులు వస్తారని చెప్పారు. ఆ నాడు ఎన్టీఆర్ గెలిపించిన ఎమ్మెల్యేలను తీసుకుని దొడ్డి దారిన చంద్రబాబు సీఎం అయ్యారని అన్నారు. ప్రజలకు తమకు తోడున్నామంటూ భరోసా ఇస్తున్నారని తెలిపారు. ఇంకో ఏడాదైతే టీడీపీ ఎమ్మెల్యేలే తమ పార్టీలోకి వస్తారని చెప్పారు. అప్పడు నైతికంగా వాళ్లతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తామని వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.
మీరా జగన్ను విమర్శించేది?: అంజాద్ బాషా
మంత్రి పదవులు, డబ్బు మూటలు, కేసుల నుంచి బయటపడటమే లక్ష్యంగా పార్టీని, నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తున్న వాళ్లకు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతికత లేదని కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా విమర్శించారు. గురువారం ఉదయం జగన్ను కలిసిన అనంతరం అంజాద్ మీడియాతో మాట్లాడారు.
పార్టీ వీడిన వాళ్లకు రాజకీయ భవిష్యత్ ఉండదని, మరోసారి ఎన్నికలకు వెళితే, వారిని ప్రజలు తిరస్కరించడం ఖాయమని అన్నారు. పార్టీలు మారిన వారు రాజీనామాలు చేసి, తిరిగి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.
కాగా, తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డితోనే ఉంటానని, పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.