వైసీపీ మరో పోరు బాట, ప్రతీ మండలంలో- జిల్లాలకు జగన్..అక్కడే..!!
మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలకు కొత్త కార్యాచరణ ఫిక్స్ చేసారు. బిగ్ టాస్క్ అప్పగించారు. రైతులకు మద్దతుగా నిలబడుతూ.. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే వ్యూహల ను ఖరారు చేసారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం పైన పార్టీ నేతలకు సూచనలు అందించారు. రైతులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమయంలో జిల్లాల పర్యటనలకు రావాలని పార్టీ నేతలు జగన్ ను కోరారు. ముందుగా కరువు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తానని జగన్ ప్రకటించారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ నేతలతో టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న కరువు పరిస్థితుల పైన సమీక్ష చేసారు. ఈ సమయంలో కరువు ప్రాంతాల్లో పర్యటనలకు రావాలని జగన్ ను వైసీపీ జిల్లా అధ్యక్షులు ఆహ్వానించారు. జగన్ వస్తేనే కరువుపై ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందన్న వైసీపీ నేతలు పేర్కొన్నారు. రాష్ట్రం లోని మూడు ప్రాంతాల్లో పర్యటన చేయాలన్న నేతల సూచనలకు జగన్ అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఉన్నాయని చెప్పిన జగన్.. ఖరీఫ్ ప్రారంభం నుంచి సెప్టెంబర్ 16 వరకు రాష్ట్రంలో 51 శాతానికిపైగా వర్షపాతం లోటు ఉందన్నారు. 688 మండలాల్లో దాదాపు 628 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయని వివరించారు. దాదాపు 332 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయని చెప్పారు. అన్నమయ్య జిల్లాలో 75 శాతం వర్షపాతం లోటు నమోదు అయిందని చెప్పిన జగన్.. సత్యసాయి జిల్లాలో 66 శాతం, ప్రకాశం జిల్లాలో 65 శాతం వర్షపాతం లోటు ఉందని తెలిపారు.

కరువు తీవ్రత ఎక్కువగా ఉన్న చోట్ల జగన్ పర్యటన
జిల్లాల వారీగా వర్షపాతం లోటు లెక్కలను పార్టీ నేతలకు అందించారు. ఎల్నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరిలోనే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
జూలై, ఆగస్టులో కూడా తీవ్ర వర్షపాతం లోటు కొనసాగినా కరువు కార్యాచరణ చేపట్టలేదని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ మాటలు నమ్మి సాగు చేసిన రైతులు ఎకరాకు ₹15 వేల నుంచి ₹20 వేలకుపైగా నష్టపోయారని చెప్పారు. శ్రీశైలం నీటిని సరైన సమయంలో రాయలసీమకు మళ్లించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉన్నప్పుడు చర్యలు తీసుకోలేదన్నారు. తెలుగు గంగ, SRBC, కేసీ కెనాల్ పరిధిలోని రిజర్వాయర్లను ముందుగానే నింపాల్సిందని వ్యాఖ్యానించారు. పులిచింతల వద్ద తెలంగాణ చేపడుతున్న లిఫ్ట్లపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పోలవరం పూర్తి సామర్థ్యంపై ప్రభుత్వం రాజీపడుతోందని విమర్శించారు. కరువు ప్రభావిత మండలాలను తక్షణమే అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. రైతులకు అండగా వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ చేపడుతుందని ప్రకటించారు. కరువు సమస్యలపై మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కార్యాచరణ చేపట్టాలి. దీనికి ముందు మండల స్థాయి నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయి వరకు రైతులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.













Click it and Unblock the Notifications
