చంద్రబాబు అడుగుజాడల్లోనే జగన్-తప్పయినా తప్పడం లేదా ? మరీ ఈ రేంజ్ లోనా ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరి ఈ మధ్యే రెండేళ్లు పూర్తయింది. ఈ కాలంలో వైసీపీ సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు చూస్తుంటే గత చంద్రబాబు హయాంలో జరిగిన తప్పిదాలంటూ వేటిని వైసీపీ నేతలు ఇన్నాళ్లూ విమర్శించారో సరిగ్గా అవే ఇప్పుడు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అంతే కాదు దానికి పది రెట్లు ఎక్కువగా, వేగంగా మరీ చంద్రబాబు నిర్ణయాల్ని వైసీపీ సర్కార్ ఫాలో అయిపోతోంది. ఎందుకంటే దారులన్నీ మూసుకుపోయిన ప్రస్తుత పరిస్దితుల్లో ఇంతకంటే మరే గొప్ప మార్గం కూడా కనిపించడం లేదు.
పద్మవ్యూహంలో చంద్రబాబు
గతంలో ఏపీలో ఐదేళ్ల పాటు ప్రభుత్వం నడిపిన చంద్రబాబు.. తన హయాంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఎదుర్కోనన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు విభజనతో నష్టపోయిన రాష్ట్రం, మరోవైపు నానాటికీ పెరిగిపోతున్న అప్పులు, కొత్తగా అప్పులు పుట్టాలంటే బ్యాంకులతో పాటు ఆర్ధిక సంస్ధలు కూడా సహకరించని పరిస్ధితి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే చంద్రబాబు బుర్ర పాదరసంగా పనిచేసింది. అంతే కొత్తగా అఫ్పుల రాక మొదలైంది. నిధుల లభ్యత పెరిగింది. దీని వెనుక చంద్రబాబుతో పాటు ఆయన వెంట ఉన్న కుటుంబరావు, యనమల రామకృష్ణుడు వంటి మేథావుల ఆలోచనలు కూడా ఉన్నప్పటికీ ప్రధానంగా టీడీపీ సర్కార్ కు వీటి ద్వారా దొరికిన ఆర్ధిక వెసులుబాటుపై అప్పట్లో పెద్ద చర్చే నడిచింది.
చంద్రబాబు ఫార్ములా ఇదే
విభజనతో నష్టపోయి, కొత్తగా అప్పులు పుట్టే పరిస్ధితి లేకపోవడంతో తన హయాంలో సీఎం చంద్రబాబు కొత్తగా కార్పోరేషన్ల ఏర్పాటు ప్రారంభించారు. వివిధ పేర్లతో ప్రారంభమైన ఈ కార్పోరేషన్ల ద్వారా భారీ ఎత్తున రుణాల సేకరణ ప్రారంభమైంది. ఉమ్మడి ఏపీలో ఎప్పుడో ఓసారి కనిపించే కార్పోరేషన్ల ద్వారా అప్పుల వ్యవహారం చంద్రబాబు హయాంలో పతాకస్ధాయికి చేరింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు వివిధ కార్పోరేషన్ల ద్వారా సేకరించిన అప్పుల్ని సైతం పీడీ ఖాతాలకు మళ్లించి ఖర్చు చేయడం కూడా అప్పుడే జోరందుకుంది. అసలు పీడీ ఖాతాల ద్వారా ఇలా నిధుల్ని మళ్లించవచ్చన్న సంగతి సాధారణ ప్రజలకు అర్ధమైంది కూడా చంద్రబాబు హయాంలోనే . దీనిపై బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు అప్పటి టీడీపీ సర్కార్ ను టార్గెట్ చేయడంతో పీడీ అకౌంట్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
చంద్రబాబు అడుగుజాడల్లో జగన్ ?
అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కార్పోరేషన్ల ద్వారా తెస్తున్న అప్పులతో పాటు పీడీ ఖాతాలు ఏర్పాటు చేసి నిధులు మళ్లించడాన్ని వైసీపీ తీవ్రంగా తప్పుబట్టేది. చంద్రబాబు సర్కార్ ఆర్ధిక అక్రమాలు చేసేస్తోందంటూ బీజేపీతో కలిసి వైసీపీ కూడా టీడీపీని తీవ్రంగా ఇరుకునపెట్టేది. దీనిపై సమాధానం చెప్పేందుకు సరైన కారణాలు కూడా లేకపోవడంతో అప్పట్లో టీడీపీ సర్కార్ నిబంధనలు మీరకుండానే ఇలా చేస్తున్నట్లు చెప్పుకునేది. సీన్ కట్ చేస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ కూడా చంద్రబాబు అడుగుజాడల్లోనే నడవడం ప్రారంభించారు. పైకి చంద్రబాబు పేరు చేబితే చాలు మండిపడే జగన్.. ఆయన ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాల్ని తూచా తప్పకుండా పాటించడం మొదలుపెట్టారు. దీనికి అప్పుడూ, ఇప్పుడు ఆర్ధిక శాఖలో తిష్టవేసిన పలువురు అధికారులే కారణమనే చర్చ కూడా నడుస్తోంది.
తప్పయినా తప్పడం లేదా ?
చంద్రబాబు హయాంలో కార్పోరేషన్ల ద్వారా తెచ్చిన అప్పులతో పాటు పీడీ ఖాతాలకు నిధుల మళ్లింపుపైనా తీవ్ర విమర్శలు చేసిన జగన్.. తాను అధికారంలోకి రాగానే దానికి పదింతలు అప్పులు తీసుకోవడం మొదలుపెట్టారు. అసలు అప్పుల కోసమే కార్పోరేషన్లు, పీడీ ఖాతాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. రాష్ట్రాభివృద్ధి కార్పోరేషన్, ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పోరేషన్ వంటి సంస్ధలు ఇలా తెరపైకి వచ్చినవే. దీంతో వీటి ద్వారా భారీ ఎత్తున రుణాల్ని రహస్యంగా సేకరించడం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం విధించే రుణాల పరిమితి దాటేడయమే కాకుండా కార్పోరేషన్ రుణాల్ని వాటిలో కలపకూడదంటూ కొత్త నిబంధనను సైతం తెరపైకి తెచ్చారు. దీంతో విపక్షాలు నోరు మెదిపేందుకు అవకాశం దక్కడం లేదు. అటు కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్నీ నిశితంగా గమనిస్తోంది. సరైన సమయంలో కొరడా ఝళిపించేందుకు సిద్ధమవుతోంది.