కేసీఆర్ బాటలోనే జగన్ ? నాన్ పొలిటికల్ జేఏసీ ప్లాన్ రిపీట్- 3 రాజధానులకు వర్కవుట్ అయ్యేనా !
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల్ని ఎట్టిపరిస్దితుల్లోనూ అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో తమకు అడ్డంకిగా మారిన అమరావతి పాదయాత్రకు సైతం చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాదయాత్రను అడ్డుకోవాలని బహిరంగంగానే పిలుపులు ఇస్తున్నారు. అయినా ప్రజలు ముందుకు కదలడం లేదు. దీంతో నాన్-పొలిటికల్ జేఏసీ రూపంలో ఓ కొత్త వేదికను ఇందుకోసం తెరపైకి తెచ్చారు. ఇది గతంలో కేసీఆర్ తెలంగాణలో చేసిన ప్రయోగమే.

అమరావతి వర్సెస్ త్రీ క్యాపిటల్స్
ఏపీలో ప్రస్తుతం అమరావతి వర్సెస్ మూడు రాజధానుల పోరు కొనసాగుతోంది. ముఖ్యంగా జనంతో సంబంధం లేకుండా రాజకీయ నేతలే వీటిని నడిపించేస్తున్నారు. అమరావతి రాజధాని ఉద్యమం వెనుక టీడీపీ సహా విపక్షాలు ఉన్నట్లు భావిస్తున్న అధికార వైసీపీ తామేం తక్కువ తిన్నా అన్నట్లుగా మూడు రాజధానుల ఉద్యమాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వికేంద్రీకరణకు అనుకూలంగా సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీటితో అంత ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో అంతకు మించిన ప్లాన్ ను జగన్ రెడీ చేశారు.

నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు
అమరావతి పాదయాత్ర ద్వారా రాజధానిపై ఒత్తిడి పెంచుతున్న విపక్షాలకు కౌంటర్ గా మూడు రాజధానులకు మద్దతిస్తూ మరో వేదిక ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఏర్పడింది. దీంతో ఇవాళ విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ తెరపైకి వచ్చింది. ఉత్తరాంధ్ర మేథావులు, ప్రజాసంఘాలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినా, దీని ప్రారంభోత్సవంలో అంతా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే కనిపించారు. అంతే కాదు అమరావతి పాదయాత్రకు వ్యతిరేకం కాదంటూనే ఇక్కడి ఆకాంక్షలకు వ్యతిరేకంగా మరొకరు ఎలా తమ ప్రాంతానికి వస్తారంటూ హెచ్చరికలు కూడా చేశారు. తద్వారా నాన్ పొలిటికల్ జేఏసీ ఏం చేయబోతోందో చెప్పకనే చెప్పేశారు.

గతంలో తెలంగాణలో కేసీఆర్ కూడా
గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా టీఆర్ఎస్ సారధిగా ఉన్న కేసీఆర్ కూడా ఇదే ప్రయత్నంచేశారు. అప్పట్లో ఉద్యమాన్ని రగల్చించేందుకు కేసీఆర్ పిలుపిస్తే మిగతా పార్టీలు భాగస్వాములయ్యే అవకాశం లేదు. దీంతో నాన్ పొలిటికల్ జేఏసీ రూపంలో కేసీఆర్ కోరుకున్న పిలుపులు, హెచ్చరికలు జారీ చేసే బాథ్యతను ప్రొఫెసర్ కోదండరామ్ నిర్వర్తించారు. తద్వారా అప్పటి కాంగ్రెస్, కమ్యూనిస్టుల్ని సైతం ఈ జేఏసీకి మద్దతిచ్చేలా చేశారు. చివరికి తెలంగాణ సాధన ఉద్యమంలో ఈ నాన్ పొలిటికల్ జేఏసీ ఎంత కీలకంగా మారిపోయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏపీలోనూ జగన్ అదే తరహా ప్రయోగం చేస్తున్నారు.

కేసీఆర్ బాటలోనే జగన్ ?
గతంలో నాన్ పొలిటికల్ జేఏసీ ప్రయోగంతో తెలంగాణలో సక్సెస్ అయిన కేసీఆర్ బాటలోనే ఇప్పుడు జగన్ కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో ఏర్పాటు చేసిన నాన్ పొలిటికల్ జేఏసీ వైసీపీ కన్నుసన్నల్లో ఏర్పడిన విషయాన్ని ఇవాళ సదస్సుకు హాజరైన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే చెప్పకనే చెప్పారు. అదే సమయంలో విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన నేతలంతా దీనికి దూరంగా ఉన్నారు. తద్వారా ఇది వైసీపీ జేఏసీగా కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ చేయాల్సిందల్లా ఈ నాన్ పొలిటికల్ జేఏసీకి సాధ్యమైనంత దూరం పాటించడమే. తద్వారా జగన్ తాను కోరుకున్న పనిని జేఏసీతో చేయిస్తే సరిపోతుంది.

జేఏసీకి విపక్షాలు మద్దతిస్తాయా ?
మూడు రాజధానుల కోసం ఏర్పాటు చేసిన నాన్ పొలిటికల్ జేఏసీ వైసీపీ మానసపుత్రికేనన్న విషయం అందరికీ తెలుస్తూనే ఉంది. అలాగే దీనికి విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ దూరంగానే ఉన్నాయనేది కూడా అర్ధమవుతూనే ఉంది. మరి ఇప్పుడు తెలంగాణ తరహాలో నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి విపక్షాలపై ఒత్తిడి పెంచి వారి మద్దతు కూడా జేఏసీకి లభించేలా చేయడం జగన్ వల్ల అవుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఇందులో వైసీపీ సర్కార్ విఫలమైతే మాత్రం అది కేవలం వైసీపీ జేఏసీగా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఈ జేఏసీని నడిపించే నేతలు, వారి విశ్వసనీయత కూడా కీలకంగా మారబోతోంది.












Click it and Unblock the Notifications