మందుబాబులకు జగన్ మరో గుడ్ న్యూస్- వైన్ షాపుల్లో ఇక గూగుల్ పే/ ఫోన్ పే...
ఏపీలో మందుబాబులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఓ అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యంషాపుల్లో డిజిటల్ చెల్లింపుల్ని అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఏపీలో మందుబాబులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇన్నాళ్లూ మద్యం కొనుగోళ్ల కోసం నేరుగా నగదు చెల్లింపులను మాత్రమే అనుమతిస్తున్నారు. వీటి స్దానంలో ఇకపై డిజిటల్ చెల్లింపుల్ని కూడా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు ఇచ్చింది.
ఏపీలో అన్ని రంగాల్లోనూ డిజిటల్ చెల్లింపులకు అనుమతిస్తున్న ప్రభుత్వం మద్యంషాపుల విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చింది. దీనిపై విపక్షాలు ఎప్పటి నుంచో విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. అవినీతి కోసమే ప్రభుత్వం ఇలా నగదు చెల్లింపుల్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ విధానంలో చెల్లింపులు చేసేందుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపుల్ని అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇవాళ్టి నుంచి వీటిని అమలు చేయనున్నారు. విజయవాడలోని ఓ మద్యం షాపులో ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ డిజిటల్ చెల్లింపులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ఎస్బీఐతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,934 ఔట్లేట్లలో దశల వారీగా డిజిటల్ చెల్లింపులకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.