సచివాలయ ఉద్యోగులకు జగన్ డబుల్ ఢమాకా-ప్రొబేషన్ తో పాటు కొత్త జీతాలు-రేపు ఉత్తర్వులు
ఏపీలో వైసీపీ ప్రభుత్వ మానసపుత్రిక అయిన సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సీఎం జగన్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉధ్యోగుల్లో అర్హత పొందిన వారికి ప్రొబేషన్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి.
రాష్ట్రంలో వేలాదిగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కు ప్రభుత్వం ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి జగన్ సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఈ రోజు లేదా రేపు వెలువడతాయని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామి రెడ్డి తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ సచివాలయ ఉద్యోగులకు పాత పే స్కేల్ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ, సీఎం జగన్ మాత్రం దానిని పక్కనపెట్టి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారమే జీతాలు ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ముఖ్యమంత్రి గారి ఆదేశాల వల్ల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలు పొందుతారు. గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ డిక్లేర్ చేయడంతో పాటు వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి జగన్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున చైర్మన్ కాకర్ల వెంకటరామి రెడ్డి తెలిపారు. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.