గుణపాఠాలు నేర్చుకున్నాం: ముందు జాగ్రత్త పడుతున్నాం: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతోన్నాయి. థర్డ్వేవ్ ఆరంభమైందంటూ నిపుణులు హెచ్చరిస్తోన్నారు. సెకెండ్ వేవ్ సమయంలో లక్షలాదిమంది కరోనా వైరస్కు బలి అయ్యారు. మరణాల సంఖ్య భారీగా పెరగడానికి చాలినంత ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం కూడా ఓ కారణమైంది. పొరుగు దేశాల నుంచి ఆక్సిజన్ను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. భారత్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు చలించి అనేక దేశాలు ఆక్సిజన్ ట్యాంకులను భారత్కు సరఫరా చేశాయి.

జగనన్న ప్రాణవాయువు ప్రారంభం..
ఇప్పుడు తాజాగా థర్డ్వేవ్ ఆరంభమైన నేపథ్యంలో- రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. జగనన్న ప్రాణవాయువు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో నిర్మించిన 144 ఆక్సిజన్ ప్లాంట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది సేపటి కిందటే తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. క్యాంప్ కార్యాలయం ఆవరణలో వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించారు.

గుణపాఠాలు నేర్చుకున్నాం..
ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితుల నుంచి గుణపాఠాలను నేర్చుకున్నామని అన్నారు. అందుకే ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నామని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఆక్సిజన్ కొరత లేకుండా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. 50, అంతకంటే ఎక్కువ పడకలు ఉన్న ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో గాలి నుంచి మెడికల్ ఆక్సిజన్ తయారుచేసే ప్రెజర్ స్వింగ్ అడ్సార్పషన్ (పీఎస్ఏ) ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.

రూ.426 కోట్లతో..
426 కోట్ల రూపాయల వ్యయంతో తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 124 సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల్లో 144 పీఎస్ఏ ప్లాంట్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 93,600 ఎల్పీఎం సామర్థ్యం గల 144 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లతో సహా క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఎల్ఎంఓ ట్యాంకులు, ఆక్సిజన్ పైపులైన్లు, ఇతర మౌలిక సదుపాయాలను ముందు జాగ్రత్త చర్యగా ప్రారంభించామని అన్నారు. ఆక్సిజన్ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితిని చూశామని, అలాంటి దుస్థితి మళ్లీ తలెత్తకూడదని చెప్పారు.

ఆక్సిజన్ పైప్లైన్లు..
అలాగే- 90.07 కోట్ల రూపాయల వ్యయంతో 24,419 పడకలకు ఆక్సిజన్ పైప్లైన్ల ఏర్పాటు చేశామని వైఎస్ జగన్ అన్నారు. 35 ఆసుపత్రుల్లో 15 కోట్ల రూపాయలతో 399 కిలోలీటర్ల సామర్థ్యం గల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్ల నెలకొల్పుకోగలిగామని చెప్పారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 20 వీఆర్డీఎల్ ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చామని, మెడికల్, ల్యాబ్ ఎక్విప్మెంట్, కోవిడ్ కిట్స్ కొనుగోళ్ల కోసం భారీగా నిధులను కేటాయించామని చెప్పారు. మరో 71 ప్రైవేటు ఆసుపత్రుల్లో 100 పడకలు ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లపై 30 శాతం సబ్సిడీ ఇస్తున్నామని పేర్కొన్నారు.
Recommended Video

ఒక్క వైరాలజీ ల్యాబ్ కూడా లేని దుస్థితి నుంచి..
ఇదివరకు రాష్ట్రంలో ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా ఉండేది కాదని, ఆ దుస్థితి నుంచి బయటపడ్డామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు 150 వైరాలజీ ల్యాబ్స్ను నెలకొల్పామని అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ను నిర్ధారించడానికి ఉద్దేశించిన జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. దేశంలో కేరళ తరువాత రెండో ల్యాబ్ విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications