బాబులా మోసం చేయను, నోటికొచ్చిన హామీలు: జగన్
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం జిల్లా గుత్తిలో నిర్వహించిన రోడ్షోలో మాట్లాడుతూ.. చంద్రబాబులా అబద్ధాలు ఆడలేనని, మోసాలు చేయలేనని అన్నారు. చంద్రబాబు అధికారం కోసం నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు పాలనలో పేదవాడికి మూడు పూటల భోజనం కూడా లభించలేదని ఆరోపించారు. ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే నాయకుడికే ఓటు వేయాలని కోరారు. పేదవాడి సంక్షేమం కోసం పాటుపడేది తమ పార్టీనేనని జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వస్తే పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తానని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా అందిస్తామని జగన్ తెలిపారు.

ప్రతీ చిన్నారి చదువుకునేందుకు రూ. 500లను వారి తల్లులకు అందజేస్తామని చెప్పారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులకు రూ. 700 పింఛన్ అందజేస్తామని హామి ఇచ్చారు. రూ. 3వేల కోట్లతో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
రూ. 2వేల కోట్లతో కరువు, వరదలు వచ్చిన సమయాల్లో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జగన్ తెలిపారు. మహిళల కోసం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వంలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లే పరిస్థితిని మార్చేస్తానని, ప్రతీ జిల్లాకు ఓ సూపర్ స్పెషలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని జగన్ పేర్కొన్నారు. బెల్టు షాపులు లేకుండా చేస్తామని చెప్పారు. ఇవన్నీ జరగాలంటే తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని జగన్ ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications