TDP కంచుకోటలో వైఎస్ జగన్.. ''మిషన్ చంద్రబాబు''
కుప్పం నియోజకవర్గం ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కావడంతోపాటు అక్కడినుంచి ఆయన వరుసగా ఏడుసార్లు గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మానసికంగా దెబ్బకొట్టాలంటే కుప్పం నియోజకవర్గాన్ని ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఓడించడం కష్టమేం కాదు
కుప్పంలో టీడీపీని ఓడిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీని ఓడించడం పెద్ద కష్టమేం కాబోదని జగన్ భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు గెలుచుకోవాలని జగన్ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. ఇటీవలే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు కుప్పం ప్రజలను మోసంచేశారని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లోను తమ పార్టీ విజయం సాధించామన్నారు. చంద్రబాబు ఏదో చేస్తారని అక్కడి ప్రజలు ఆశలు పెట్టుకున్నారని, కానీ అవన్నీ అడియాశలవడంవల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిపాలైందని సజ్జల వ్యాఖ్యానించారు.

జగన్ దృష్టి మొత్తం కుప్పంపైనే?
కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు ఆయనపై ప్రత్యర్థిగా ఉన్న భరత్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. నియోజకవర్గ బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు ఆయన సోదరుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. పలు అభివృద్ధి పథకాలను అమలు చేయడంద్వారా ఇక్కడ వైసీపీని గెలిపించాలని జగన్ భావిస్తున్నారు. మరోవైపు ఆయన దృష్టి మొత్తం కుప్పంపై ఉండటంతో తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు కుప్పంతోపాటు మరో నియోజకవర్గం నుంచి పోటీచేయాలని చంద్రబాబుకు సూచిస్తున్నారు.

తిరస్కరించిన బాబు
ఆ ప్రతిపాదనను బాబు నిర్ధ్వంద్వంగా తిరస్కరించారు. కుప్పంతోపాటు మరో నియోజకవర్గాన్ని ఎన్నుకుంటే భయపడుతున్నామనే సంకేతం పార్టీ శ్రేణులకు, ప్రజలకు వెళుతుందని, కార్యకర్తలు డీలా పడతారని, రెండో నియోజకవర్గం ఊసే లేదని, కుప్పం నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు. పార్టీ తరఫున క్యాడర్ ను సిద్ధం చేయడంతోపాటు కుప్పం చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లోను కచ్చితంగా విజయం సాధించే అభ్యర్థులనే ఎంపిక చేయాలని బాబు నిర్ణయించారు. అంతేకాకుండా జియో ట్యాగింగ్ ద్వారా ఓటర్లను గుర్తించే ప్రక్రియకు బాబు శ్రీకారం చుట్టారు. దీన్ని బట్టి టీడీపీ ఓటర్లు ఎంతమంది ఉన్నారనేది? ఒక స్పష్టత వస్తుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications