హోదాపై ఆత్మరక్షణలో జగన్, పవన్ని కార్నర్ చేసేందుకు రోజా ముందస్తు 'అస్త్రం'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్యమానికి సిద్ధమైన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడినట్లుగా కనిపిస్తోంది. పవన్ ఉద్యమిస్తే.. అందరికంటే వైసిపికే ఎక్కువ నష్టమనే వాదనలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ను కార్నర్ చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా శుక్రవారం నాడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వీటి పైన రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
హోదా వద్దని పవన్ చెప్పారా?
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం పవన్ కళ్యాణేనని రోజా షాకింగ్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో ప్యాకేజీల పాలనకు ఆయనే కారణమన్నారు. గతంలో పవన్ కళ్యాణే ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పారని, ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని సభలు పెడుతున్నారని విమర్శించారు.

రోజా చేసిన ఈ వ్యాఖ్యల పైన జోరుగా చర్చ సాగుతోంది. ఓ వైపు పవన్ ప్రత్యేక హోదా కోసం 2014 ఎన్నికల సమయంలో తాను మద్దతిచ్చిన బీజేపీ, టీడీపీలనే నిలదీసేందుకు ముందుకు వస్తే.. హోదా రాకపోవడానికి ఆయనే కారణమని చెప్పడం ఏమిటనే చర్చ సాగుతోంది.
బీజేపీకి మద్దతుపై పవన్ స్పష్టత
తాను బీజేపీ - టీడీపీలకు ఎందుకు మద్దతిచ్చాననే విషయాన్ని పవన్ సూటిగా చెప్పారు. విభజన నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయే ఏపీని ఆదుకునేందుకు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపించిందని, అందుకే మద్దతిచ్చానని చెప్పారు. అలాగే, కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన చంద్రబాబు సీఎం అయితే బాగుంటుందని మద్దతిచ్చినట్లు చెప్పారు.
ప్రశ్నిస్తానని చెప్పి..
తాను ఆ పార్టీలకు మద్దతిచ్చినప్పుడు ప్రజల విషయంలో తాను ప్రశ్నిస్తానని ఎన్నికల ప్రచారం సమయంలోనే చెప్పారు. అలాగే, రాజధాని భూములు, కాపు రిజర్వేషన్ల పైన ప్రశ్నించారు. తాజాగా ప్రత్యేక హోదా పైన కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యారు.
ఆలస్యంగా ఎందుకంటే...
ప్రత్యేక హోదా విషయంలో తాను ప్రశ్నించకపోవడాన్ని పలువురు ప్రశ్నించారని, కానీ తాను వేచి చూసి చూసి ఇప్పుడు ప్రశ్నించేందుకు సిద్ధమయ్యానని పవన్ స్పష్టంగా చెప్పారు.
ఇంత క్లారిటీ ఇచ్చినా...
ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ ఇంత క్లారిటీ ఇచ్చినప్పటికీ వైసిపి, ముఖ్యంగా రోజా హోదా రాకపోవడానికి ఆయనే కారణమని చెప్పడంపై చర్చ సాగుతోంది.
ప్రత్యేక హోదా అంశాన్ని పవన్ లేవనెత్తుతే తమకే నష్టం జరుగుతుందని భావించినందు వల్లే వైసిపి నేతలు, రోజా ఈ విషయంలో ఆయనను ఇరికించే విధంగా మాట్లాడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్యాకేజీ: ఆత్మరక్షణలో జగన్.. పవన్ను ఇరికించేందుకా?
పవన్ తిరుపతి సభ అనంతరం కేంద్రంలో హోదా లేదా ప్యాకేజీ పైన కదలిక వచ్చింది. ఇటు బీజేపీ భారీ ప్యాకేజీ.. ఓ విధంగా హోదాను మించిన ప్యాకేజీ కోసం కసరత్తు చేస్తోంది. మరోవైపు ఏపీకి ప్యాకేజీ ఇచ్చినా, హోదా కోసం ఆ తర్వాత డిమాండ్ మాత్రం ఉంటుందని, ప్యాకేజీ ఇచ్చినంత మాత్రాన హోదా ఇవ్వరని కాదని టిడిపి చెబుతోంది.
దాదాపు ప్రస్తుతానికి ప్యాకేజీ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్యాకేజీ వస్తే.. హోదా రానందుకు పవన్నే బాధ్యుడిని చేయాలని, అప్పుడు పవన్ వల్లనే భారీ ప్యాకేజీ వచ్చినా.. ఆయను కార్నర్ చేసినట్లవుతుందనేది వైసిపి వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు. హోదా విషయంలో నిన్నటి దాకా వైసిపి చంద్రబాబును నిలదీసింది. తమ కమీషన్ల కోసం ప్యాకేజీకి చంద్రబాబు ఓకే చెబుతున్నారని చెప్పిన వైసిపి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్లే హోదా రావడం లేదని, ప్యాకేజీ వస్తోందని ఆరోపించడం గమనార్హం.












Click it and Unblock the Notifications