వైజాగ్ సదస్సు తెచ్చిన పెట్టుబడుల్లో ఐటీనే టాప్-పరిశ్రమల సదస్సుల్లో జగన్ కీలక ఆదేశాలు..
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఒప్పందాల అమలుపై సీఎం వైయస్.జగన్ ఇవాళ సమావేశం నిర్వహించారు. పరిశ్రమల శాఖ సమీక్షలో భాగంగా జరిగిన ఈ సమావేశంలో శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాలు, ప్రస్తుతం వాటి పరిస్థితులపై సీఎం సమగ్ర సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్లలో వృద్ధిని అధికారులు వివరించారు.
స్థిరధరల సూచీ ప్రకారం 2019లో రాష్ట్రం ఏపీ జీడీపీ వృద్ధి 5.36శాతం కాగా ఇది దేశ సగటు 6.5శాతం కన్నా తక్కువ అని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. గత నాలుగేళ్లలో మాత్రం మంచి ప్రగతి ఉందన్నారు. 2021-22లో రాష్ట్ర జీఎస్డీపీ గ్రోత్ రేట్ 11.43శాతానికి పెరిగిందని వెల్లడించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరుసగా నంబర్ ఒన్ స్థానంలో నిలుస్తున్నామని, 2022-23లో జీడీఎస్డీపీలో గ్రోత్ రేట్ 16.22 శాతంగా ఉందని వెల్లడించారు. జీడీఎస్డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం దాదాపు రూ.13లక్షల కోట్ల వాటా కలిగి ఉందని, ఇది 21శాతం నుంచి 23శాతానికి పెరిగిందన్నారు

పారిశ్రామిక రంగ ప్రగతిలో ఎంఎస్ఎంఈలది కీలక పాత్రని సీఎం జగన్ తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కూడా ఈ రంగంలోనే ఉన్నాయన్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులు, వాటి ఉత్పత్తిని సాధించడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం? ఉత్పత్తి అయిన వస్తువులకు అంతర్జాతీయంగా ప్రముఖ బహుళజాతి సంస్థలతో అనుసంధానం? ఈ మూడు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అదికారులకు సూచించారు.
పరిశ్రమల శాఖలో ఎంఎస్ఎంఈలకోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం జగన్, ఈ విభాగానికి ఒక కార్యదర్శిని కూడా నియమించాలన్నారు. రాష్ట్రం నుంచి బహుళ ఉత్పత్తులు, బహుళ దేశాలకు ఎగుమతులు లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. మరోవైపు నైపుణ్యాలను పెంచడంపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ప్రస్తుతం ఉన్నడిగ్రీలకు తోడు అదనంగా ప్రత్యేక నైపుణ్యాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు వైజాగ్ సదస్సు ద్వారా వచ్చిన పెట్టుబడులకు సంబంధించి మరికొన్ని వివరాలనూ అధికారులు సీఎంకు వివరించారు. పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు కుదిరాయని, ఇందులో 13 ఒప్పందాలు ఇప్పటికే వాస్తవ రూపం దాల్చాయని, రూ.2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు. ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు - ఎలక్ట్రానిక్స్ రంగంలో 88 ఒప్పందాలు చేసుకోగా, వీటి విలువ రూ.44,963 కోట్లని తెలిపారు. ఇందులో 85శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడమో, లేదా ఉత్పత్తికి సిద్ధం కావడమో జరిగిందని వెల్లడించారు. దీంతో దాదాపుగా రూ.38,573 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపం దాల్చాయన్నారు.












Click it and Unblock the Notifications