బెంగళూర్లో హ్యాపీగా ఉన్నాం: జగన్ భార్య భారతి
హైదరాబాద్: తన భర్త, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పుట్టుకతోనే వెండి పల్లెంలో పుట్టాడని ఆయన భార్య వైయస్ భారతి అన్నారు. ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలు మాట్లాడారు. ఆలాంటి జగన్ తన మామ వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కున్నారని, అయినా వెనకడుగు వెయలేదని ఆమె అన్నారు. టీవీల్లో, పేపర్లలో రకరకాలుగా వార్తలు వస్తున్నప్పుడు తమకైనా కోపం వస్తుంది గానీ జగన్కు మాత్రం కోపం రాదని ఆమె చెప్పారు.
జగన్ రాజకీయాల్లోకి రాక ముందు బెంగళూర్లో ఉండేవాళ్లమని, జగన్కు మిత్రులు లేకపోడంతో ఎక్కువగా పిల్లలతో గడిపేవారని, తమది హ్యాపీ ఫ్యామిలీ అని ఆమె అన్నారు. జగన్ జైలుకి వెళ్లినప్పుడు తనకు చాలా బాధనిపించిందని చెప్పారు. జగన్ జైలు నుంచి బయటకు వస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకున్నట్లు భారతి తెలిపారు.
రాజకీయాల్లోకి ఉన్నప్పుడు నీచమైన కుట్రలు చేస్తూనే ఉంటారని, తాను అనుభవించిన బాధను మరోసారి తట్టుకోలేనని చెప్పినప్పుడు జగన్ నవ్వి ఎక్కుడు వెళ్తామని అన్నారని ఆమె గుర్తు చేసుకున్నారు. జగన్ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా ప్రజలకు తెలుసునని, అలాంటి తాను ఎవరికీ భయపడడం సరి కాదనీ ఓదార్పు యాత్రకు పోతున్నానని చెప్పారని భారతి వివరించారు.
జగన్ దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు పోవద్దని చెప్పాలనిపించలేదని ఆమె అన్నారు. కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ కుటుంబంపై కక్ష సాధింపు ప్రారంభమైందని, అయిదేళ్ల క్రితం ఎన్నికలు జరిగిన సమయానికి తమ మామ వైయస్ ఉన్నరని, ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే వైయస్ ఉన్నప్పుడు... ఆ తర్వాత జీవితాలు ఇంతగా మారిపోతాయా అనిపించిందని ఆమె అన్నారు.